కాంగ్రెస్ కోసం దశాబ్దాలుగా పనిచేసిన సీనియర్ కార్యకర్తలకు గుర్తింపు కల్పించాలి: మెట్టు శ్యామ్ సన్…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్
నిజామాబాద్, జూలై 14: నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలం నడిపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మెట్టు శ్యామ్ సన్ తన ఆవేదనను వ్యక్తం చేశారు.
ఆయన మాట్లాడుతూ.. 1988లో ప్రస్తుత టీపీసీసీ అధ్యక్షుడు బొమ్మా మహేష్ కుమార్ గౌడ్ అప్పట్లో ఎన్ఎస్యూఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, ప్రస్తుత రాష్ట్ర వ్యవసాయ కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్ ఎన్ఎస్యూఐ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో వారి నాయకత్వంలో పనిచేసినట్లు తెలిపారు. కల్లు గీత కార్మికుల సొసైటీ చైర్మన్ శేఖర్ గౌడ్ హయాంలో డిచ్పల్లి మండల ఎన్ఎస్యూఐ అధ్యక్షుడిగా సేవలందించానని చెప్పారు.
1990లో ఎన్ఎస్యూఐ జిల్లా ఉపాధ్యక్షుడిగా, 1994లో మహేష్ కుమార్ గౌడ్కు డిచ్పల్లి అసెంబ్లీ టికెట్ వచ్చిన సమయంలో రాడికల్స్ భయం ఉన్నప్పటికీ నియోజకవర్గమంతా పార్టీ విజయం కోసం అంకితభావంతో పనిచేశానని పేర్కొన్నారు. 1996లో యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా, అనంతరం డిచ్పల్లి మండల బీసీ కాంగ్రెస్ అధ్యక్షుడిగా, 2014లో మండల కో-ఆప్షన్ సభ్యుడిగా బాధ్యతలు నిర్వహించినట్లు తెలిపారు.
గత పదేళ్ల టీఆర్ఎస్ పాలనలో ఎన్నో ఇబ్బందులు ఎదురైనా పార్టీని వీడలేదని, ఇటీవల నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి గారి విజయానికి కూడా కష్టపడి పనిచేశానని చెప్పారు.
డిచ్పల్లి నియోజకవర్గ కాంగ్రెస్ నాయకుల దురదృష్టం ఏమిటంటే, దివంగత ఎ. బాల్రెడ్డి గారి తర్వాత పూర్తి స్థాయి ఎమ్మెల్యే నాయకత్వం లేకపోవడం వల్ల పార్టీ కార్యకర్తలు, సీనియర్ నాయకులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. మధ్యలో ఆకుల లలిత గారు కొంతకాలం ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ, శాశ్వత నాయకత్వం లేకపోవడం శాపంగా మారిందన్నారు.
పార్టీ కోసం దశాబ్దాలుగా పనిచేసిన సీనియర్ నాయకులకు సరైన గుర్తింపు లేకపోవడం, ప్రోటోకాల్ విషయంలో అవమానాలు ఎదురుకావడం బాధాకరమని తెలిపారు. నిన్నమొన్నటి వరకు టీఆర్ఎస్, బీజేపీలో ఉన్న నాయకులు వేదికలపై గౌరవ స్థానాలు పొందుతుంటే, కాంగ్రెస్ కోసం జీవితాంతం శ్రమించిన వారు ప్రేక్షకులుగా మిగిలిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ పరిస్థితి కొనసాగితే భవిష్యత్తులో డిచ్పల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి నష్టం జరిగే అవకాశం ఉందని హెచ్చరించారు.
అన్ని సామాజిక వర్గాలకు సమన్యాయం చేసిన కాంగ్రెస్ పార్టీ, క్రిస్టియన్ మైనారిటీ నాయకులకు కూడా తగిన గుర్తింపు కల్పించి, రాష్ట్ర కాంగ్రెస్ కమిటీలో పదవులు ఇవ్వాలని కోరారు. పార్టీ కోసం నిస్వార్థంగా పనిచేసిన సీనియర్ కార్యకర్తలకు సముచిత గౌరవం, గుర్తింపు కల్పించాలని టీపీసీసీ అధ్యక్షుడు బొమ్మా మహేష్ కుమార్ గౌడ్ను మెట్టు శ్యామ్ సన్ విజ్ఞప్తి చేశారు.

























