గన్నారం గ్రామంలో సామాజిక బహిష్కరణ ఆరోపణలపై సమీక్ష నిర్వహించిన రాష్ట్ర ఎస్సీ/ఎస్టీ కమిషన్ చైర్మన్…
నిజామాబాద్: తెలంగాణ రాష్ట్ర ఎస్సీ/ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య, కమిషన్ సభ్యుడు రాంబాబు నాయక్తో కలిసి నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలం గన్నారం గ్రామాన్ని సందర్శించారు.
గ్రామంలో సామాజిక బహిష్కరణ జరిగినట్లు వచ్చిన ఆరోపణల నేపథ్యంలో క్షేత్రస్థాయిలో పరిస్థితులను పరిశీలించిన చైర్మన్, అనంతరం సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా బాధితులకు చట్టబద్ధంగా న్యాయం జరిగేలా తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అలాగే సంబంధిత శాఖలు పరస్పర సమన్వయంతో పనిచేసి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని సూచించారు.
అనంతరం చైర్మన్ బక్కి వెంకటయ్య, కమిషన్ సభ్యుడు రాంబాబు నాయక్ డిచ్పల్లి మండలంలోని తెలంగాణ విశ్వవిద్యాలయాన్ని సందర్శించారు. అక్కడ విద్యార్థులకు అందుతున్న విద్యా, వసతి, ఇతర మౌలిక సదుపాయాలపై విశ్వవిద్యాలయ అధికారులతో సమీక్ష నిర్వహించారు.
ఈ పర్యటనలో అదనపు కలెక్టర్, జిల్లా రెవెన్యూ అధికారి (డీఆర్వో), డిప్యూటీ కలెక్టర్ (యూటీ), అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ఏసీపీ), షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ఉపసంచాలకులు, ఎస్సీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ఈడీ), జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి (డీటీడీఓ)తో పాటు సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

























