ఏపీలో రెండేళ్ల తర్వాత విధుల్లోకి ఇద్దరు ఐపీఎస్లు.. కొనసాగనున్న క్రమశిక్షణ చర్యలు…
కాదంబరి జెత్వానీ కేసులో ఐపీఎస్ అధికారులు కాంతి రాణా, విశాల్ గున్ని సస్పెన్షన్ రద్దు
వారిని వెంటనే విధుల్లోకి తీసుకోవాలని ఉత్తర్వులు జారీ
వారిపై క్రమశిక్షణ, క్రిమినల్ విచారణలు యథావిధిగా కొనసాగుతాయన్న ప్రభుత్వం
అధికార దుర్వినియోగం ఆరోపణలపై 2024 సెప్టెంబర్లో సస్పెన్షన్
2024 ఫిబ్రవరి 2న వైఎస్సార్సీపీ నేత కుక్కల విద్యాసాగర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ముంబైకి చెందిన నటి, మోడల్ కాదంబరి జెత్వానీ, ఆమె కుటుంబ సభ్యులపై ఇబ్రహీంపట్నం పోలీసులు ఫోర్జరీ, చీటింగ్, బెదిరింపుల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. మరుసటి రోజే విజయవాడ పోలీసు బృందం ముంబై వెళ్లి జెత్వానీని, ఆమె తల్లిదండ్రులను అరెస్టు చేసి విజయవాడకు తీసుకొచ్చింది. అయితే, ఎఫ్ఐఆర్ నమోదు కాకముందే తమను అరెస్టు చేసేందుకు పోలీసులు ప్లాన్ చేశారని, తమను అక్రమంగా నిర్బంధించి వేధించారని జెత్వానీ ఆరోపించారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత ఈ ఆరోపణలపై జరిగిన విచారణలో, ఎఫ్ఐఆర్ నమోదుకు ముందే విమాన టికెట్లు బుక్ చేశారని, ఉన్నతాధికారుల ఆదేశాలతోనే అరెస్టు జరిగిందని తేలడంతో ఈ అధికారులపై సస్పెన్షన్ వేటు పడింది.
మరోవైపు, ఈ కేసులో జెత్వానీపై కూడా విచారణ కొనసాగుతోంది. ఆమెపై దాఖలైన ఛార్జ్షీట్లో విద్యాసాగర్ నుంచి సుమారు రూ. 1.32 కోట్లు వసూలు చేశారని సీఐడీ ఆరోపించింది. ఈ ఆరోపణలను జెత్వానీ ఖండించారు. తనపై తప్పుడు కేసు బనాయించారని, తానే బాధితురాలినని ఆమె వాదిస్తున్నారు.

























