బాధితుల గోప్యతను కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత మీడియా సంస్థలు , సోషల్ మీడియా వినియోగదారులకు పోలీసు శాఖ విజ్ఞప్తి : పోలీస్ కమీషనర్ వెల్లడి…
లైంగిక నేరాలు , మహిళలు మరియు చిన్నారులకు సంబంధించిన నేరాలు , అలాగే చట్టపరంగా గోప్యత కల్పించాల్సిన కేసుల విషయంలో బాధితురాలు లేదా బాధితుడి వ్యక్తిగత వివరాలను అత్యంత గోప్యంగా ఉంచడం ప్రతి ఒక్కరి బాధ్యత అని నిజామాబాదు పోలీస్ కమీషనర్ పి. సాయి చైతన్య, ఐ.పి.యస్. తెలిపారు.
ఈ తరహా కేసులకు సంబంధించిన వార్తలను ప్రచురించే సమయంలో బాధితురాలు / బాధితుడి పేరు , ఫోటో , వీడియో , ఇంటి చిరునామా , విద్యాసంస్థ , ఉద్యోగ స్థలం , కుటుంబ సభ్యుల వివరాలు , గ్రామం లేదా కాలనీ పేరు , సోషల్ మీడియా ఖాతాల వివరాలు లేదా వారి గుర్తింపును నేరుగా లేదా పరోక్షంగా తెలియజేసే ఎలాంటి సమాచారాన్ని ప్రచురించరాదు.
న్యూస్ పేపర్లు , న్యూస్ ఛానళ్లు , వెబ్ మీడియా , యూట్యూబ్ ఛానళ్లు , ఫేస్బుక్ , ఇన్స్టాగ్రామ్ , ఎక్స్ (ట్విట్టర్) , వాట్సాప్ , టెలిగ్రామ్ తదితర సోషల్ మీడియా వేదికలలో కూడా బాధితుల గుర్తింపును వెల్లడించే విధంగా వార్తలు, పోస్టులు, వీడియోలు లేదా చిత్రాలను ప్రసారం చేయడం, ప్రచురించడం లేదా షేర్ చేయడం చట్టవిరుద్ధం.
భారత సుప్రీంకోర్టు జారీ చేసిన మార్గదర్శకాలు, భారతీయ న్యాయ సంహిత (BNS), భారతీయ నాగరిక్ సురక్షా సంహిత (BNSS), పిల్లలపై లైంగిక నేరాల నిరోధక చట్టం (POCSO) మరియు ఇతర సంబంధిత చట్టాల నిబంధనలను ప్రతి మీడియా సంస్థ, జర్నలిస్టు మరియు సోషల్ మీడియా వినియోగదారు తప్పనిసరిగా పాటించాలి.
బాధితుల గుర్తింపును బహిర్గతం చేయడం వల్ల వారికి, వారి కుటుంబ సభ్యులకు తీవ్రమైన మానసిక వేదన, సామాజిక ఇబ్బందులు మరియు భద్రతాపరమైన సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. అందువల్ల బాధితుల గౌరవం, వ్యక్తిగత గోప్యత మరియు హక్కులను పరిరక్షించడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత.
అందుచేత అన్ని ప్రింట్ మీడియా , ఎలక్ట్రానిక్ మీడియా , డిజిటల్ మీడియా మరియు సోషల్ మీడియా వేదికల నిర్వాహకులు, ప్రతినిధులు , కంటెంట్ సృష్టికర్తలు మరియు ప్రజలు బాధితుల గుర్తింపును ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా వెల్లడించకుండా అత్యంత బాధ్యతాయుతంగా వ్యవహరించాలని పోలీసు శాఖ విజ్ఞప్తి చేస్తోంది.
చట్టాలకు విరుద్ధంగా బాధితుల గుర్తింపును బహిర్గతం చేసినట్లయితే సంబంధిత చట్టాల ప్రకారం తగిన న్యాయపరమైన చర్యలు తీసుకోబడతాయని పోలీసు శాఖ హెచ్చరిస్తోంది.

























