నిజామాబాద్ రూరల్లో ప్రభుత్వ వైద్య సేవల బలోపేతానికి ప్రత్యేక చొరవ…
రూరల్ నియోజకవర్గ వైద్య సేవల అభివృద్ధికి సమగ్ర ప్రతిపాదనలు…
మంత్రి దామోదర్ రాజనర్సింహ సానుకూల స్పందన…
ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలే లక్ష్యంగా ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి కృషి…
నిజామాబాద్ మెడికల్ కలశాల మరియు ఆసుపత్రిని రిఫరల్ గా తీర్చిదిద్దాలి…
రాష్ట్ర సచివాలయంలో వైద్యారోగ్య శాఖ మంత్రి సమగ్ర సమీక్ష…
పలు కీలక అంశాలను మంత్రి దృష్టికి తీసుకెళ్ళిన ఎమ్మెల్యే…
నిజామాబాద్ జిల్లాలో ప్రభుత్వ వైద్య సేవలను మరింత బలోపేతం చేసి ప్రజలకు నాణ్యమైన ఆరోగ్య సేవలు అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ సోమవారం సచివాలయంలో నిజామాబాద్ జిల్లా ఆరోగ్య రంగంపై సమగ్ర సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో *ప్రభుత్వ సలహాదారు, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి,* వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా నిజామాబాద్ ప్రభుత్వ మెడికల్ కళాశాల మరియు ఆసుపత్రిలో గాంధీ, ఉస్మానియా తరహా సదుపాయాలు అందుబాటులోకి తెచ్చి రిఫరల్ ఆసుపత్రిగా తీర్చిదిద్దాలని ఎమ్మెల్యే లు సుదర్శన్ రెడ్డి, భూపతి రెడ్డి కోరగా మంత్రి సానుకూలంగా స్పందించారు.
అటు నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందేలా చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి విస్తృతంగా ప్రతిపాదనలు సమర్పించారు. గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలను మరింత చేరువ చేయడంతో పాటు రోగులు సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం తగ్గేలా ఆరోగ్య మౌలిక వసతులను అభివృద్ధి చేయాలని కోరారు.
నియోజకవర్గంలోని తిర్మాన్పల్లి PHC లో వైద్య సిబ్బందిని బలోపేతం చేయాలని, ప్రజలకు మెరుగైన సేవలు అందేలా అవసరమైన పోస్టులను భర్తీ చేయాలని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.
అదేవిధంగా ధర్పల్లి, డిచ్పల్లి CHC లను అప్గ్రేడ్ చేసి తెలంగాణ వైద్య విధాన పరిషత్ (TVVP) ఆసుపత్రులగా చేసినా వైద్య సిబ్బందిని మంజూరు చేయాలని ప్రతిపాదించారు. దీంతో గ్రామీణ ప్రాంత ప్రజలకు ప్రత్యేక వైద్య సేవలు మరింత విస్తృతంగా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని వివరించారు.
నియోజకవర్గంలోని మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో గల కాలూరు-ఖానాపూర్, గూపన్పల్లి, బోర్గాం (పీ)ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను అర్బన్ పీహెచ్సీలుగా అభివృద్ధి చేయాలని కోరారు. జనాభా పెరుగుదల, వైద్య సేవలపై పెరుగుతున్న అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ మార్పులు అత్యవసరమని పేర్కొన్నారు.
అత్యంత కీలక ప్రతిపాదనగా డిచ్పల్లి కమ్యూనిటీ హెల్త్ సెంటర్ను (CHC) 100 పడకల మాతా-శిశు (మదర్ అండ్ చైల్డ్) ప్రత్యేక ఆసుపత్రిగా అభివృద్ధి చేయాలని సూచించారు. ఈ ప్రతిపాదన అమలైతే గర్భిణీలు, బాలింతలు, చిన్నారులకు అత్యాధునిక వైద్య సేవలు స్థానికంగానే అందుబాటులోకి వస్తాయని తెలిపారు.
అలాగే ఇందల్వాయి పీహెచ్సీని ట్రామా సెంటర్గా ఏర్పాటు చేయాలని, జాతీయ రహదారి పరిసరాల్లో జరిగే ప్రమాదాల్లో బాధితులకు సకాలంలో అత్యవసర వైద్యం అందించేందుకు ఇది ఎంతో ఉపయోగపడుతుందని వివరించారు.
అదేవిధంగా సిరికొండ, ముదక్పల్లి, జక్రాన్పల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను కమ్యూనిటీ హెల్త్ సెంటర్లుగా (CHC) అప్గ్రేడ్ చేయాలని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఈ ప్రతిపాదనలపై మంత్రి దామోదర్ రాజనర్సింహ సానుకూలంగా స్పందించి, సాధ్యాసాధ్యాలను పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
జిల్లా ప్రభుత్వ జనరల్ *ఆసుపత్రిలో సిబ్బంది నియామకం, ఎంఆర్ఐ స్కానింగ్ సేవలు, పారిశుద్ధ్య నిర్వహణ, సూపర్ స్పెషాలిటీ సేవల విస్తరణపై* కూడా ఎమ్మెల్యే ప్రత్యేకంగా ప్రస్తావించారు. అలాగే నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిని టిమ్స్ తరహాలో అభివృద్ధి చేయాలని, మెడికల్ కళాశాలలో సిబ్బంది నియామకాలతో పాటు సర్జరీ సహా మరిన్ని సూపర్ స్పెషాలిటీ కోర్సులను ప్రారంభించాలని కోరారు.
సమావేశంలో స్పందించిన మంత్రి దామోదర్ రాజనర్సింహ, త్వరలోనే డీఎంఈ మరియు మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నతాధికారులు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి, వైద్య కళాశాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి సిబ్బంది అవసరాలు, వైద్య పరికరాల లభ్యత, పారిశుద్ధ్యం, మౌలిక వసతులపై సమగ్ర నివేదిక సమర్పించాలని ఆదేశించారు.
ప్రజలకు నాణ్యమైన, అందుబాటులో ఉండే వైద్య సేవలను అందించడం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు. నిజామాబాద్ జిల్లా ఆరోగ్య రంగాన్ని మరింత బలోపేతం చేసి గ్రామీణ ప్రాంత ప్రజలకు కూడా అత్యుత్తమ వైద్య సేవలు అందేలా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు.
ఈ సమీక్ష సమావేశంలో ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి ప్రస్తావించిన ప్రతిపాదనలు నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో ఆరోగ్య మౌలిక వసతులు గణనీయంగా మెరుగుపడి, గ్రామీణ ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు మరింత చేరువ కానున్నాయి. ఈ ప్రతిపాదనలకు మంత్రి సానుకూలంగా స్పందించి అతిత్వరలో అమలు చేస్తామని హామీ ఇచ్చినట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు.

























