శ్రీశ్రీశ్రీ గోవిందగిరి స్వామి దివ్య యోగాశ్రమంలో శ్రీ సంత మల్లన్న స్వాములకు భిక్ష…
త్రిశుల్ న్యూస్ రిపోర్టర్ బాంపెల్లి నితీష్…
నిజామాబాద్ జిల్లా బాల్కొండ అసెంబ్లీ నియోజకవర్గ పరిధి వేల్పూర్ శివారులో గల కుండలిని జ్ఞాన యోగి, అవధూత బ్రహ్మ, స్పర్శజ్ఞాని శ్రీశ్రీశ్రీ గోవిందగిరి స్వామి దివ్య యోగాశ్రమంలో బెంగళూరుకు చెందిన గోవింద గిరి స్వామి శిష్యుడు, ప్రముఖ ఆధ్యాత్మిక వ్యక్తిత్వ వికాసనిపుణుడు శ్రీ రాఘవేంద్ర స్వామి ఆధ్వర్యంలో ఆషాడమాసం చివరి శుక్రవారం రోజున వేల్పూర్ మండలంలోని అంక్సాపూర్ గ్రామానికి చెందిన శ్రీ సంత మల్లన్న స్వామి మాల ధారణ స్వాములకు (భక్తులకు) సాత్వికాహారంతో కూడిన భిక్షను ఏర్పాటు చేశారు. దీక్ష నియమాలను పాటిస్తూ దీక్షలో ఉన్న స్వాములను సాక్షాత్తు మల్లన్న స్వామి వారిగా భావించి ఎంతో పవిత్రతతో, నిష్టగా అల్లం, వెల్లుల్లి, ఉల్లిపాయలు వంటి తామసిక పదార్థాలను వాడకుండా కేవలం సాత్వికమైన ఆహారాన్ని వండి మల్లన్న స్వాములకు భిక్ష ఏర్పాటు చేసి వడ్డించారు. మల్లన్న స్వామికి పట్నం వేసి ప్రత్యేక పూజలు చేశారు. భజనలు చేస్తూ “ఏమి జేతురా నాదు లింగా, అవధూత గురుదేవుడు అవతారా పురుషుడు, స్వామి గోవిందా శ్రీ గురుని గన్నారా, వెండికొండపై నివాసముండే బోలా మల్లన్నా” అంటూ మల్లన్న స్వామి, బోలా శంకరునిపై పలు భజనలు పాటలు పాడి ఆనంద పరవశుల్ని చేశారు. వండిన ఆహార పదార్థాలను నైవేద్యంగా సమర్పించారు. ఈ సందర్భంగా శ్రీ రాఘవేంద్ర స్వామి మాట్లాడుతూ శ్రీ మల్లికార్జున స్వామి ఇతివృత్తాన్ని సవివరించారు. మల్లన్న స్వామి భక్తులకు భిక్షపెట్టడం చాలా పుణ్యకార్యం. మీ అందరిపై గోవిందగిరి స్వామి, మల్లన్న స్వామి కృపాకటాక్షాలు శుభాశీస్సులు ఎల్లవేళలా ఉండాలి అని అన్నారు. భిక్షానంతరం ధ్యాన మందిరంలో సంతమల్లన్న స్వాములకు తాంబూలంతో పాటు నోటుబుక్కు, పెన్ను, మల్లన్నకు ఇష్టమైన పసుపు పచ్చని శాలువాలు ఇచ్చారు. కార్యక్రమంలో అబ్బగోని జగదీశ్వర్ గౌడ్, సాయిరాం బాల్రాజ్, ఇరుపాజి దామోదర్ గౌడ్, నోముల గంగారెడ్డి, గడ్డం మల్లేష్, కుంట సువర్ణ, దమ్మాయి లక్ష్మి, మెండె మహేందర్, కంకణాల రాజేశ్వర్, కమిటీ సభ్యులు, అంక్సాపూర్ సంత మల్లన్న స్వామి భక్తులు, శ్రీ గోవిందగిరి స్వామి శిష్యులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.























