పవిత్రమైన ఆధ్యాత్మిక శోభను తెచ్చేది శ్రావణ మాసమే…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ బొంపల్లి నితీష్…
బాల్కొండ అసెంబ్లీ నియోజకవర్గము లోని వేల్పూర్ శివారులో గల అవధూత బ్రహ్మ, కుండలిని జ్ఞాన యోగి శ్రీ శ్రీ శ్రీ గోవింద గిరి స్వామి దివ్య యోగాశ్రమంలో శ్రావణమాసంలోని తొలి గురువారము సందర్భంగా ఆశ్రమాలయం లోని దేవుళ్లకు ఆలయ అర్చకులు జన్మంచి ప్రవీణ్ కుమార్ పంతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ధ్యాన మందిరంలో సామూహికంగా భజనలు చేశారు. బెంగళూరుకు చెందిన గోవింద గిరి స్వామి శిష్యుడు శ్రీ రాఘవేంద్ర స్వామి శ్రీ సాయిబాబా దేవాలయంలో భక్తులను ఉద్దేశించి తమ గురుదేవులు చెప్పిన శ్రావణ మాసానికి చెందిన పలు విషయాల్ని తెలిపారు. ఇళ్లన్నీ లక్ష్మీదేవి నిలయాలుగా మారేవేళ, పూల సువాసనలు, పచ్చని తోరణాలు, మంగళ కరమైన వాతావరణాన్ని నింపుతాయి. పూజలు, వ్రతాలు, పెళ్లిళ్లకు ఇది ఎంతో అనువైన సమయం. ఈ పవిత్ర మాసంలో తొలి రోజు లక్ష్మీదేవి అనుగ్రహం కొరకై ప్రత్యేక పూజలు చేస్తారు. శ్రీమహావిష్ణువు జన్మనక్షత్రం శ్రావణ నక్షత్రం కావడం వల్ల ఈనెల మరింత పవిత్రమైనదిగా భావిస్తారు. ఇక ఈ మాసంలో లక్ష్మీదేవి, శ్రీమహావిష్ణువుతో పాటు పరమశివుడిని ఆరాధించడం వల్ల సకల ఐశ్వర్యాలు, పుణ్యఫలాలు లభిస్తాయని విశ్వసిస్తారు. సాయంత్రం వేళ లక్ష్మీదేవి ముందు ప్రమిదల్లో దీపారాధన చేయాలి. ఇంకా వీలైతే లక్ష్మీ అష్టోత్తరం లేదా విష్ణు సహస్రనామ పారాయణం చేయడం చాలా మంచిది. శివాలయానికి వెళ్లి స్వామివారికి అభిషేకం చేయడం వల్ల విశేషమైన ఫలితాలు ఉంటాయి అని అన్నారు. తదనంతరం పల్లకి సేవను ఘనంగా నిర్వహించి అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.























