గణేష్ మండలి నిర్వాహకులు తప్పనిసరిగా నిబంధనలు పాటించాలి: నిజామాబాద్ పోలీస్ కమిషనర్…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ నాయుడి ప్రభాకర్…
నిజామాబాద్ జిల్లాలో గణేష్ ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు గణేష్ మండలి నిర్వాహకులు తప్పనిసరిగా పోలీసుల సూచనలు, నిబంధనలు పాటించాలని పోలీస్ కమిషనర్ సూచించారు.
గణేష్ మండపాల వద్ద డీజేలకు ఎలాంటి అనుమతి లేదని, డీజేలను పూర్తిగా నిషేధించినట్లు తెలిపారు. లౌడ్స్పీకర్లకు సంబంధిత ఏసీపీ నుంచి తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలని, రాత్రి 10 గంటలలోపు లౌడ్స్పీకర్లను నిలిపివేయాలని సూచించారు. అధిక శబ్దంతో వృద్ధులు, గుండె సంబంధిత సమస్యలు ఉన్నవారు, విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. సుప్రీంకోర్టు నిబంధనలను ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
మండపాల వద్ద విద్యుత్ భద్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. నాణ్యమైన వైర్లను ఉపయోగించి, ప్రతి మండపం వద్ద ఎంసీబీ ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు. లైటింగ్ కోసం వైర్లను పీవీసీ పైపుల ద్వారా ఏర్పాటు చేయాలని, సురక్షితమైన కవర్లతో కూడిన ఫ్లడ్లైట్లను మాత్రమే వినియోగించాలని సూచించారు. విద్యుత్ షార్ట్సర్క్యూట్ జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. వర్షాల నేపథ్యంలో మండపాలపై నాణ్యమైన రేకులు, ప్లాస్టిక్ కవర్లతో షెడ్ ఏర్పాటు చేసి, వర్షపు నీరు లోపలికి రాకుండా చూడాలని తెలిపారు.
గణేష్ విగ్రహం ఏర్పాటు చేసే ప్రదేశం, నిమజ్జనం చేసే రోజు, వెళ్లే మార్గం తదితర వివరాలను ముందుగానే సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారులకు తెలియజేయాలని సూచించారు. భారీ విగ్రహాలను తరలించే సమయంలో విద్యుత్ తీగలు, రహదారి పరిస్థితులు, ఎత్తు తదితర అంశాలను ముందుగానే పరిశీలించి జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. వీలైనంత వరకు మట్టి విగ్రహాలు, తక్కువ ఎత్తు గల గణపతులను ప్రోత్సహించి పర్యావరణాన్ని కాపాడాలని కోరారు.
గణేష్ మండపాల వద్ద భక్తులను క్రమపద్ధతిలో క్యూ పద్ధతిలో దర్శనానికి అనుమతించాలని, అవసరమైన చోట బారికేడ్లు ఏర్పాటు చేయాలని సూచించారు. భక్తుల వాహనాలను కూడా ట్రాఫిక్కు ఇబ్బంది కలగకుండా క్రమపద్ధతిలో పార్కింగ్ చేయించాలన్నారు. మహిళలు, యువతుల పట్ల ఈవ్టీజింగ్ జరగకుండా నిర్వాహకులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని తెలిపారు.
ప్రతి గణేష్ మండలి వద్ద ఉదయం, రాత్రి వేళల్లో కనీసం ఇద్దరు లేదా ముగ్గురు కమిటీ సభ్యులు తప్పనిసరిగా అందుబాటులో ఉండాలని సూచించారు. పోలీసుల తనిఖీల సమయంలో వారు మండపం వద్ద ఉండాలని, మండపాల వద్ద అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా చూసుకోవాలన్నారు. ప్రతి మండలి వద్ద పాయింట్ పుస్తకం ఏర్పాటు చేసుకోవాలని, తనిఖీకి వచ్చిన పోలీసు అధికారులు అందులో నమోదు చేసి సంతకం చేస్తారని తెలిపారు.
మండపాల వద్ద అగ్ని ప్రమాదాల నివారణకు ముందస్తు జాగ్రత్తగా రెండు బకెట్ల నీరు, రెండు బకెట్ల ఇసుక, ఫైర్ బాల్స్ అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. యువత సంయమనంతో వ్యవహరించాలని, పుకార్లను నమ్మవద్దని, ఎలాంటి అనుమానాస్పద వస్తువులు లేదా బ్యాగులు కనిపించినా వాటిని తాకకుండా వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు.
గణేష్ ఉత్సవాల్లో మద్యపానం, పేకాట, టపాసులకు దూరంగా ఉండాలని నిర్వాహకులు, భక్తులకు సూచించారు. ప్రజలకు అసౌకర్యం కలిగించే అంశాలు ఏవైనా ఉంటే వెంటనే సమీప పోలీసులకు సమాచారం ఇవ్వాలని లేదా డయల్ 100కు ఫోన్ చేయాలని తెలిపారు. పోలీస్ కంట్రోల్ రూమ్ నంబర్ 87126 59700కు కూడా సమాచారం అందించవచ్చని పేర్కొన్నారు.
నిమజ్జనం సందర్భంగా ప్రత్యేక జాగ్రత్తలు
నిమజ్జనం రోజున పోలీస్ శాఖ సూచించిన నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని పోలీస్ కమిషనర్ సూచించారు. గణేష్ విగ్రహాలు, రథాలు క్రమపద్ధతిలో క్యూలో వెళ్లేలా చర్యలు తీసుకోవాలని, ప్రతి రథానికి తగిన లైటింగ్ ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు. నిమజ్జనం సమయంలో చిన్న పిల్లలను సాధ్యమైనంత వరకు దూరంగా ఉంచాలని సూచించారు.
బావులు, చెరువులు, కాలువలు, గోదావరి తదితర నీటి వనరుల్లో నిమజ్జనం చేసే సమయంలో ఈత వచ్చిన పెద్దవారు మాత్రమే నీటిలోకి వెళ్లాలని, పోలీసుల సూచనల మేరకు నిమజ్జనం నిర్వహించాలని తెలిపారు. లోతైన నీటి ప్రాంతాల్లో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని, అవసరమైన చోట సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.
నిమజ్జనం సమయంలో ఎవరూ విన్యాసాలు చేయకూడదని, సెల్ఫీలు తీసుకోవడం వంటి ప్రమాదకర చర్యలకు పాల్పడవద్దని హెచ్చరించారు. విగ్రహాన్ని తరలించే మార్గంలో విద్యుత్ తీగలు, రహదారి వెడల్పు, వాహనాలు వెళ్లే పరిస్థితి, ఇతర అడ్డంకులను ముందుగానే పరిశీలించాలని సూచించారు.
నిమజ్జనం సందర్భంగా భారీగా జనసమూహం ఉండే అవకాశం ఉన్నందున చిల్లర దొంగతనాలపై అప్రమత్తంగా ఉండాలని, భజన కార్యక్రమాల్లో పాల్గొనే వారు పోలీసుల సూచనలు, అనుమతులు పాటిస్తూ భక్తి భావంతో వ్యవహరించాలని తెలిపారు.
గణేష్ ఉత్సవాలను ప్రశాంతంగా, భక్తి శ్రద్ధలతో నిర్వహించేందుకు ప్రజలు, గణేష్ మండలి నిర్వాహకులు పోలీస్ శాఖకు పూర్తిగా సహకరించాలని పోలీస్ కమిషనర్ కోరారు.

























