మహిళా ఎమ్మెల్యేలపై దాడిని నిరసిస్తూ బీఆర్ఎస్ మహిళా నేతల ధర్నా…
నిజామాబాద్: అసెంబ్లీ ఆవరణలో మహిళా ఎమ్మెల్యేలు సునీతా లక్ష్మారెడ్డి, సబితా ఇంద్రారెడ్డిలపై దాడి జరిగిందని ఆరోపిస్తూ.. నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల ఆధ్వర్యంలో బీఆర్ఎస్ మహిళా నాయకులు, కార్యకర్తలు నిరసన చేపట్టారు.
నిజామాబాద్లోని ఎన్టీఆర్ చౌరస్తా ధర్నా చౌక్లో నిర్వహించిన ఈ ధర్నాలో మహిళా ప్రజాప్రతినిధులపై దాడి చేయడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని బీఆర్ఎస్ నాయకులు మండిపడ్డారు.
ప్రజల తరఫున ప్రశ్నించే ప్రతిపక్ష ఎమ్మెల్యేలపై దాడులు చేయడం తీవ్రంగా ఖండించాల్సిన విషయమని పేర్కొన్నారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.
“మహిళా ప్రజాప్రతినిధులకు రక్షణ కల్పించాలి.. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి” అంటూ నినాదాలు చేస్తూ బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు నిరసన తెలిపారు.
ఈ కార్యక్రమంలో మాజీ మేయర్ దండు నీతుకిరణ్, మాజీ కార్పొరేటర్లు విశాలిని రెడ్డి, సిర్ప సువర్ణ, మంజుల యాదవ్, చింతకాయల అలేఖ్య, గంగ, సంధ్య తదితరులు పాల్గొన్నారు.

























