కాళోజీ స్ఫూర్తితో తెలంగాణ రక్షణ సేన అడుగులు..
టీఆర్ఎస్ కార్యాలయంలో ఘనంగా కాళోజీ జయంతి వేడుకలు…
హైదరాబాద్ : ప్రజాకవి కాళోజీ నారాయణ రావు స్ఫూర్తితో తెలంగాణ రక్షణ సేన ముందుకు సాగుతుందని పార్టీ సీనియర్ నాయకులు ఎల్. రూప్ సింగ్, నవీన్ ఆచారి, సయ్యద్ ఇస్మాయిల్ అన్నారు. బంజారాహిల్స్ లోని పార్టీ కార్యాలయంలో బుధవారం కాళోజీ నారాయణరావు జయంతి సందర్భంగా పార్టీ నాయకులతో కలిసి వారి చిత్రపటానికి పూల మాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, తమ ప్రాంతంపై దోపిడీకి దిగితే ఎంతటి వాళ్లనైనా సరే ఎదురించాలంటూ తెలంగాణ సమాజాన్ని కాళోజీ చెతన్య పరిచారని అన్నారు. కాళోజీ స్ఫూర్తితోనే కవిత టీఆర్ఎస్ స్థాపించి ఈ ప్రాంత హక్కుల పరిరక్షణ కోసం పనిచేస్తున్నారని అన్నారు. ప్రాంతేతరుడు దోపిడీ చేస్తే పొలిమేర వరకు తరిమికొట్టాలని, ప్రాంతం వాడే దోపిడీ చేస్తే ప్రాంతంలోనే బొంద పెట్టాలన్న పిలుపును ఆదర్శంగా తీసుకొని తెలంగాణ ప్రయోజనాల కోసం టీఆర్ఎస్ పనిచేస్తుందని అన్నారు. తెలంగాణను దోపిడీ చేసిన ఆంధ్రా పాలకులను తరిమికొట్టి ఈ ప్రాంతాన్ని విముక్తం చేసుకున్నామని.. ఇప్పుడు మన దగ్గరే ఉన్న మన వాళ్ల తెలంగాణాను దోపిడీ చేస్తున్నారని వాళ్లను బొంద పెట్టి సబ్బండ వర్గాలు, సకల జనుల అభివృద్ధి, సాధికారత కోసం తెలంగాణ రక్షణ సేన పాటు పడుతందని అన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు ఎత్తరి మారన్న, ముస్తఫా, ఆనందం తదితరులు పాల్గొన్నారు.























