విశ్వహిందూ పరిషత్ ఇందూర్ జిల్లా ఆధ్వర్యంలో స్థాపన దినోత్సవ కార్యక్రమం…
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలో విశ్వహిందూ పరిషత్ ఇందూర్ జిల్లా, ఆర్మూర్ నగర శాఖ ఆధ్వర్యంలో స్థాపన దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా యువకులతో ఉట్టి కొట్టే కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా ముఖ్య వక్త, నగర సహ కార్యవహ బౌద్ధిక్ ప్రముఖ్ దయాసాగర్ మాట్లాడుతూ.. ఆధునిక జీవన విధానం, కెరీర్ అభివృద్ధి పేరుతో కుటుంబ వ్యవస్థను నిర్లక్ష్యం చేయవద్దని యువతకు సూచించారు. కెరీర్ ఎంత ముఖ్యమో కుటుంబ విలువలు, సామాజిక బాధ్యతలు కూడా అంతే ముఖ్యమని అన్నారు.
సరైన సమయంలో వివాహం చేసుకుని కుటుంబ విలువలను కాపాడుకోవాలని, పిల్లలను బాధ్యతాయుతమైన పౌరులుగా తీర్చిదిద్దడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. కుటుంబ వ్యవస్థలో వస్తున్న మార్పులు, యువత ఎదుర్కొంటున్న సమస్యలు, మహిళల భద్రత, మతమార్పిడులు, జనాభా సమతుల్యత వంటి పలు అంశాలపై కార్యక్రమంలో చర్చించారు.
హిందూ సమాజంలో ఐక్యతను బలోపేతం చేయడం, సామాజిక సమస్యలపై ప్రజల్లో అవగాహన కల్పించడం, కుటుంబ వ్యవస్థ పరిరక్షణ కోసం మరిన్ని కార్యక్రమాలు నిర్వహించాలని దయాసాగర్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్ జిల్లా కార్యదర్శి గాజుల దయానంద్, జిల్లా విశేష సంపర్క ప్రముఖ్, ఆర్మూర్ ప్రభారీ అల్జాపూర్ అక్షయ్, నగర కార్యదర్శి కొంగి, ఉపాధ్యక్షులు గంజాల ప్రేమ్, బజరంగ్ దళ్ సంయోజక్ కత్తి శ్రీనివాస్, సురక్ష ప్రముఖ్ ప్రవీణ్, సత్సంగ్ ప్రముఖ్ సచిన్, సప్తాహిక మిలన్ ప్రముఖ్ అరవింద్, బలోపాసన ప్రముఖ్ సాయి, సేవ ప్రముఖ్ శ్రీకాంత్, సంస్కృత ప్రముఖ్ యోగేష్, ప్రచార ప్రముఖ్ అనురాగ్తో పాటు పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు.

























