బస్సు సర్వీసులపై ప్రయాణికుల ఇబ్బందులు.. బోర్డులు ఏర్పాటు చేయాలని డిమాండ్…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్
నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి బస్టాండ్లో ప్రయాణికులు పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, సమస్యలను పరిష్కరించాలని ప్రయాణికులు కోరుతున్నారు.
డిచ్పల్లి బస్టాండ్లో ఆర్మూర్ డిపోకు చెందిన బస్సులకు రూట్, సమయాలతో కూడిన బోర్డులు ఏర్పాటు చేయడంతో ప్రయాణికులకు సౌకర్యంగా ఉంటోందని చెబుతున్నారు. అయితే నిజామాబాద్ డిపో-1కు చెందిన బస్సులకు సరైన బోర్డులు లేకపోవడంతో ఏ బస్సు ఎక్కడికి వెళ్తుందో తెలుసుకోవడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని ప్రయాణికులు అంటున్నారు. ముఖ్యంగా తెలంగాణ యూనివర్సిటీ విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.
కొన్ని బస్సులు డిచ్పల్లి బస్టాండ్లో ఆపకుండా వెళ్లిపోతున్నాయని, మరికొందరు కండక్టర్లు వెనుక బస్సు వస్తుందని చెప్పి ప్రయాణికులను ఎక్కించుకోకుండా వెళ్లిపోతున్నారని ఆరోపిస్తున్నారు. అలాగే కామారెడ్డి డిపోకు చెందిన కొన్ని పల్లె వెలుగు బస్సులు ధర్మారం(బి) గ్రామంలో ఆపకుండా వెళ్తున్నాయని ప్రయాణికులు పేర్కొన్నారు.
డిచ్పల్లి బస్టాండ్లోకి వచ్చే బస్సులు వేగంగా రావడంతో ప్రయాణికులకు ప్రమాదం జరిగే అవకాశం ఉందని, డ్రైవర్లు వేగాన్ని తగ్గించాలని కోరుతున్నారు. ప్రైవేట్ ఆర్టీసీ బస్సుల డ్రైవర్లు, కండక్టర్లు కూడా నిబంధనలు పాటించాలని ప్రయాణికులు విజ్ఞప్తి చేస్తున్నారు.
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం అందిస్తున్న నేపథ్యంలో కొందరు డ్రైవర్లు, కండక్టర్లు మహిళల పట్ల ఇబ్బందికరంగా వ్యవహరిస్తున్నారనే ఫిర్యాదులు వస్తున్నాయని, అధికారులు స్పందించి ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
నిజామాబాద్ డిపో-1 డీఎం, ఆర్టీసీ ఉన్నతాధికారులు స్పందించి బస్టాండ్లో రూట్, సమయాల బోర్డులు ఏర్పాటు చేయడంతో పాటు బస్సుల నిలుపుదల, వేగ నియంత్రణపై దృష్టి సారించాలని ప్రయాణికులు కోరుతున్నారు.

























