పంచాయతీలకు నిధుల వినియోగంలో జాప్యానికి చెక్…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్
నిజామాబాద్: గ్రామ పంచాయతీలకు వచ్చే నిధులను మరింత సులభంగా, వేగంగా వినియోగించుకునేలా తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన పంచాయతీరాజ్ చట్టం–2018 నాలుగో సవరణ బిల్లు–2026కు నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి శాసనసభలో మద్దతు తెలిపారు.
పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క ప్రవేశపెట్టిన సవరణ బిల్లుపై గురువారం అసెంబ్లీలో మాట్లాడిన భూపతి రెడ్డి.. గ్రామ పంచాయతీలకు వచ్చే నిధుల వినియోగంలో జరుగుతున్న జాప్యాన్ని తగ్గించేందుకు ఈ సవరణ ఉపయోగపడుతుందని అన్నారు.
ఇప్పటివరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వివిధ పథకాల కింద వచ్చే నిధులు ట్రెజరీ ద్వారా జమ కావడం, వాటిని అభివృద్ధి పనులకు వినియోగించే క్రమంలో పరిపాలనా ప్రక్రియల కారణంగా ఆలస్యం జరుగుతోందని తెలిపారు. దీంతో కొన్ని సందర్భాల్లో గ్రామాల్లో అభివృద్ధి పనులు కూడా ఆలస్యమవుతున్నాయని పేర్కొన్నారు.
కొత్త సవరణతో గ్రామ పంచాయతీలకు వచ్చే నిధులను స్థానిక సహకార బ్యాంకులు, జాతీయ బ్యాంకులు, పోస్టాఫీసుల్లో జమ చేసుకునే అవకాశం కలుగుతుందని భూపతి రెడ్డి తెలిపారు. దీనివల్ల గ్రామాల అవసరాలకు అనుగుణంగా నిధులను సకాలంలో వినియోగించి అభివృద్ధి పనులను వేగవంతం చేసే అవకాశం ఉంటుందని అన్నారు.
రహదారులు, డ్రైనేజీలు, పారిశుద్ధ్యం, తాగునీరు, వీధిదీపాలు, పంచాయతీ భవనాలు వంటి మౌలిక వసతుల అభివృద్ధికి నిధులు సకాలంలో అందుబాటులో ఉండటం ఎంతో కీలకమని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
గ్రామీణ తెలంగాణ అభివృద్ధికి వేగం పెంచడంతో పాటు స్థానిక సంస్థలను మరింత బలోపేతం చేసే ఈ సవరణ బిల్లుకు తన సంపూర్ణ మద్దతు ఉంటుందని డా. ఆర్. భూపతి రెడ్డి స్పష్టం చేశారు.

























