జీజీహెచ్, నిజామాబాద్ లో కాళోజీ నారాయణరావు జయంతి వేడుకలు ఘనంగా నిర్వహణ…
నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో పద్మ విభూషణ్ డా. కాళోజీ నారాయణరావు జయంతి వేడుకలను ఈ రోజు ఆసుపత్రి సూపరింటెండెంట్ డా. ఎల్. రాములు గారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా సూపరింటెండెంట్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో కాళోజీ నారాయణరావు గారు కీలక పాత్ర పోషించిన గొప్ప స్వాతంత్య్ర సమరయోధులు, ప్రజాకవి అని కొనియాడారు. తన రచనలు, కవితల ద్వారా ప్రజల్లో చైతన్యాన్ని కలిగించి, తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తినిచ్చారని తెలిపారు. కాళోజీ గారి రచనల్లో తెలంగాణ ప్రజల జీవన విధానం, యాస, భాష ప్రతిబింబించాయని పేర్కొన్నారు.
ఆయన సేవలకు గుర్తింపుగా కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం ఆయన పేరుతో కొనసాగుతోందని పేర్కొన్నారు.
కాళోజీ నారాయణరావు గారి ఆశయాలు, ప్రజాసేవా స్ఫూర్తిని నేటి తరాలు ఆదర్శంగా తీసుకోవాలని సూపరింటెండెంట్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి వైద్యులు, నర్సింగ్ సిబ్బంది, ఇతర అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.

























