ఇందూరు అభివృద్ధికి నిధులు మంజూరు చేయండి..
సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ…
ఇందూరు నియోజకవర్గ అభివృద్ధికి ప్రత్యేక నిధులు మంజూరు చేయాలని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరారు. బుధవారం అసెంబ్లీలో సీఎంను కలిసి పలు అభివృద్ధి పనులతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు.
నిజామాబాద్ నగర అభివృద్ధికి రూ.200 కోట్ల ప్రత్యేక నిధులు మంజూరు చేయాలని ఎమ్మెల్యే కోరారు. అలాగే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్, తెలంగాణ విశ్వవిద్యాలయంలో ఫార్మసీ కళాశాల ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.
నగరంలో పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యకు పరిష్కారంగా ఔటర్ రింగ్ రోడ్లకు అనుమతులు ఇవ్వాలని, మాస్టర్ ప్లాన్ను అమలు చేయాలని కోరారు. కళాభారతి పెండింగ్ బిల్లులు విడుదల చేయడంతో పాటు రాజారాం స్టేడియం ఆధునికీకరణ, పాత కలెక్టరేట్ మైదానంలో సింథటిక్ ట్రాక్తో కూడిన స్టేడియం, ఇండోర్ స్టేడియం మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు.
అదేవిధంగా ఇందూరు ఖిల్లా రామాలయ అభివృద్ధికి చర్యలు తీసుకోవడంతో పాటు ఆలయాన్ని రెవెన్యూ శాఖ నుంచి దేవాదాయ శాఖకు బదిలీ చేయాలని కోరారు. జిల్లా జనరల్ ఆసుపత్రిలో మరమ్మతులు, మౌలిక వసతుల కోసం నిధులు కేటాయించి, వైద్యులు, సిబ్బంది కొరతను తీర్చాలని తెలిపారు.
ముఖ్యంగా నిజామాబాద్ బస్టాండ్ ఆధునికీకరణపై ప్రత్యేక దృష్టి సారించాలని సీఎం రేవంత్ రెడ్డిని ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ కోరారు.

























