గణేష్ నవరాత్రి ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించుకోవాలి: కమ్మర్పల్లి ఎస్సై సతీష్…
త్రిశూల్ న్యూస్ కమ్మర్పల్లి మండల్ రిపోర్టర్ గుర్రం నరేష్
నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లి మండలంలో గణేష్ నవరాత్రి ఉత్సవాల నేపథ్యంలో డీజే, సౌండ్ సిస్టమ్ నిర్వాహకులకు పోలీసులు కౌన్సెలింగ్ నిర్వహించారు. కమ్మర్పల్లి పోలీస్ స్టేషన్లో నిర్వహించిన ఈ కార్యక్రమం అనంతరం డీజే ఆపరేటర్లను స్థానిక తహసీల్దార్ సమక్షంలో హాజరుపరిచి బైండోవర్ చేశారు.
ఈ సందర్భంగా కమ్మర్పల్లి ఎస్సై సీహెచ్. సతీష్ మాట్లాడుతూ.. గణేష్ నవరాత్రి ఉత్సవాలను ప్రశాంతమైన, ఆనందకరమైన వాతావరణంలో నిర్వహించుకోవాలని సూచించారు. సుప్రీంకోర్టు ఆదేశాలు, ప్రభుత్వ నిబంధనల ప్రకారం అధిక శబ్దాలు చేసే డీజేలు, సౌండ్ సిస్టమ్ల వినియోగంపై ఆంక్షలు ఉన్నాయని తెలిపారు.
గణేష్ మండపాల వద్ద, శోభాయాత్రలు, నిమజ్జనం సమయంలో డీజేలు, బాక్స్ వాల్స్ ఉపయోగించరాదని స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘించి డీజేలు ఏర్పాటు చేస్తే సంబంధిత నిర్వాహకులపై చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు సౌండ్ పరికరాలను సీజ్ చేస్తామని హెచ్చరించారు.
ప్రజలు గణేష్ ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో, శాంతియుతంగా జరుపుకోవాలని, మండపాల నిర్వాహకులు పోలీసులకు పూర్తిగా సహకరించాలని ఎస్సై సతీష్ కోరారు.

























