తిమ్మాపూర్లో ఏడుకొండల వెంకన్న రూపంలో లంబోదరుడు
గల్లీ బాయ్స్ యూత్ ఆధ్వర్యంలో వైభవంగా ప్రతిష్ఠాపన
భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్న గణనాథుడి దివ్యరూపం…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్: కే. నగేష్
మోర్తాడ్: గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండలం తిమ్మాపూర్ గ్రామంలో ఏడుకొండల వెంకటేశ్వర స్వామి దివ్యరూపంలో లంబోదరుడు కొలువుదీరాడు. తిమ్మాపూర్ గల్లీ బాయ్స్ యూత్ సభ్యుల ఆధ్వర్యంలో వినాయక విగ్రహాన్ని భక్తిశ్రద్ధలతో, వైభవంగా ప్రతిష్ఠించారు.
తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి రూపంలో దర్శనమిస్తున్న గణనాథుడిని చూసేందుకు తిమ్మాపూర్ గ్రామంతో పాటు పరిసర ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. ప్రత్యేక అలంకరణతో ఏర్పాటు చేసిన వినాయక మండపం భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది.
ఈ సందర్భంగా గల్లీ బాయ్స్ యూత్ సభ్యులు మాట్లాడుతూ..
“వినాయకుడిని ఏడుకొండల వెంకన్న స్వామి రూపంలో ప్రతిష్ఠించడం ద్వారా భక్తుల్లో ఆధ్యాత్మిక భావనతో పాటు ఐక్యతను పెంపొందించాలన్నదే మా సంకల్పం. గణనాథుడి ఆశీస్సులతో గ్రామ ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నాం. భక్తులందరూ అధిక సంఖ్యలో తరలివచ్చి వెంకన్న రూపంలో కొలువుదీరిన గణనాథుడిని దర్శించుకుని స్వామివారి కృపకు పాత్రులు కావాలి” అని తెలిపారు.
నవరాత్రుల సందర్భంగా మండపం వద్ద నిత్య పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా గల్లీ బాయ్స్ యూత్ సభ్యులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.

























