వైశ్యులంతా ఐక్యతగా ఉండాలి.. రాజకీయంగా ఎదగాలి: ఎమ్మెల్యే ధన్పాల్…
ఆర్యవైశ్య పట్టణ సంఘం ఆధ్వర్యంలో ఉత్తర తిరుమలలో ఘనంగా వనభోజన కార్యక్రమం
ఇందూరు: వైశ్యులంతా ఐక్యంగా ఉంటూ రాజకీయ, సామాజిక రంగాల్లో మరింత ముందుకు సాగాలని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా అన్నారు.
ఆర్యవైశ్య పట్టణ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం నగరంలోని ఉత్తర తిరుమలలో నిర్వహించిన వనభోజన కార్యక్రమంలో ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అంతకుముందు శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ఆషాఢ మాసంలో ప్రతి సంవత్సరం వనభోజనాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. ఆటపాటలతో వైశ్య కుటుంబాలన్నీ ఒకే వేదికపై కలవడం ఆనందదాయకమని చెప్పారు.
వైశ్యులు కేవలం వ్యాపార రంగానికే పరిమితం కాకుండా ఆధ్యాత్మిక, సామాజిక సేవా కార్యక్రమాలు, ఆలయ అభివృద్ధిలోనూ ముందుంటారని కొనియాడారు. ప్రతి ఒక్కరూ ఐక్యతతో ఉంటూ కష్టసుఖాల్లో పరస్పరం అండగా నిలవాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య పట్టణ సంఘం అధ్యక్షుడు ధన్పాల్ శ్రీనివాస్ గుప్తా, కార్యదర్శి ఇల్లెందుల ప్రభాకర్, కోశాధికారి గాలి నాగరాజు, కార్యవర్గ సభ్యులు, ఆలయ ధర్మకర్త సంపత్ తదితరులు పాల్గొన్నారు.

























