మెండోరాలో ప్రత్యేక గ్రామసభ.. ఉపాధి హామీ పథకం పనులపై అవగాహన
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్
ఇంకుడు గుంతలు, ఫామ్ పాండ్ల నిర్మాణానికి ప్రభుత్వం ప్రోత్సాహం – సర్పంచ్ కుంట లక్ష్మీ రమేష్
మెండోరా గ్రామ సర్పంచ్ కుంట లక్ష్మీ రమేష్ ఆధ్వర్యంలో వీబీజీ రాంజీ ఉపాధి హామీ పథకం కింద గ్రామంలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై చర్చించేందుకు ప్రత్యేక గ్రామసభ నిర్వహించారు.
ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ, ప్రస్తుతం నెలకొన్న వర్షాభావ పరిస్థితుల్లో బోరు బావులు ఎండిపోకుండా ఉండాలంటే వర్షపు నీటిని ఒడిసిపట్టే చర్యలు చేపట్టడం అత్యంత అవసరమని అన్నారు. వీబీజీ రాంజీ పథకం ద్వారా బోరు బావులు ఉన్న ప్రతి ఇంటి వద్ద ఇంకుడు గుంతలు నిర్మించుకోవాలని సూచించారు. అలాగే ఇళ్లలో వినియోగించిన వృథా నీరు, వర్షపు నీరు ఇంకుడు గుంతల్లోకి వెళ్లేలా ఏర్పాటు చేసుకుంటే బోరు బావులు రీఛార్జ్ అవుతాయని వివరించారు.
ఇంకుడు గుంత నిర్మించుకునే ప్రతి లబ్ధిదారుకు ప్రభుత్వం రూ.6,500 ఆర్థిక సహాయం అందిస్తోందని తెలిపారు. అదేవిధంగా రైతులకు ఎలాంటి ఖర్చు లేకుండా ఉపాధి హామీ కూలీల ద్వారా వ్యవసాయ భూముల్లో ఫామ్ పాండ్లు నిర్మించి ఇస్తున్నామని, ఆసక్తి గల రైతులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
ఫామ్ పాండ్ల నిర్మాణం వల్ల భూగర్భ జలాలు పెరగడంతో పాటు వాటిలో చేపల పెంపకం చేపట్టి రైతులు అదనపు ఆదాయం పొందే అవకాశం ఉందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు, కొత్తగా ఇల్లు నిర్మించుకునే యజమానులు, వార్డు సభ్యులు చెప్పాల సత్యనారాయణ, డాక్టర్ సంతోష్, బాబురావు, బాజిరెడ్డి అభిలాష్, మహ్మద్ షఫీ, కాంగ్రెస్ నాయకులు చాకలి గంగాధర్, కంఠం సత్యం తదితరులు పాల్గొన్నారు.

























