బీడీ కార్మికులకు రూ.4,016 జీవన భృతి ఇవ్వాలి…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ నాయుడి ప్రభాకర్…
నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలం లింగసముద్రం గ్రామంలో తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ (ఐఎఫ్టీయూ) ఆధ్వర్యంలో బీడీ కార్మికుల సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి జె.పీ. గంగాధర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు ఎన్నికల ప్రచారంలో బీడీ కార్మికులకు పలు హామీలు ఇచ్చిందన్నారు. ముఖ్యంగా బీడీ కార్మికులకు చేయూత పథకం కింద నెలకు రూ.4,016 జీవన భృతి అందిస్తామని హామీ ఇచ్చిందని తెలిపారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి పాలన కొనసాగుతున్నప్పటికీ, బీడీ కార్మికులకు ఇచ్చిన హామీని అమలు చేయడంలో జాప్యం జరుగుతోందని ఆయన అన్నారు. ఎలాంటి షరతులు విధించకుండా ప్రతి బీడీ కార్మికురాలికి నెలకు రూ.4,016 జీవన భృతి అందించేలా చేయూత పథకాన్ని వెంటనే అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
బీడీ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం పోరాటాన్ని మరింత ఉధృతం చేయాలని సమావేశంలో తీర్మానించారు.
ఈ సమావేశంలో కార్మికులు నాగమణి, విజయ, రేఖ, సల్మా, సుల్తానా, నరుసు, విజయలక్ష్మి తదితరులతో పాటు యూనియన్ జిల్లా సహాయ కార్యదర్శి ఎం. సుప్రియ పాల్గొన్నారు.

























