ఆధ్యాత్మికతతో సేవాభావం.. ఆలయ పరిశుభ్రతకు యోగ సభ్యుల శ్రీకారం…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్…
భీమ్గల్, ఆగస్టు 30: ఆలయాల పరిశుభ్రతను సామాజిక బాధ్యతగా భావిస్తూ భీమ్గల్ యోగ సభ్యులు సేవా కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఆదివారం పట్టణంలోని నంది గల్లీలో ఉన్న శ్రీ నందీశ్వర స్వామి ఆలయంలో యోగ సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొని పరిశుభ్రత కార్యక్రమం నిర్వహించారు.
ఆలయ ప్రాంగణంతో పాటు పరిసర ప్రాంతాల్లో పేరుకుపోయిన చెత్తాచెదారం, దుమ్ము, ఇతర వ్యర్థాలను తొలగించి పరిశుభ్రంగా తీర్చిదిద్దారు. ఆలయంలోని పూజా సామగ్రి, ఇతర వస్తువులను క్రమబద్ధంగా సర్ది శుభ్రపరిచారు.
యోగ సాధన ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించుకోవడంతో పాటు సమాజ సేవలోనూ భాగస్వాములు కావాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు యోగ సభ్యులు తెలిపారు. దేవాలయాన్ని పరిశుభ్రంగా ఉంచడం కూడా భగవంతునికి చేసే సేవలో భాగమేనని పేర్కొన్నారు.
యోగాలో భాగంగా ప్రతి ఆదివారం గిరిప్రదక్షిణ కార్యక్రమం నిర్వహిస్తున్నామని సభ్యులు తెలిపారు. భక్తులు, ఆలయానికి వచ్చే ప్రజలు పరిశుభ్రతను పాటించాలని కోరారు.
నందీశ్వర స్వామి ఆలయ పరిశుభ్రత కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో యోగ సభ్యులు పాల్గొనడంతో ఆలయ ప్రాంగణంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. సేవా కార్యక్రమంలో పాల్గొన్న యోగ సభ్యులను స్థానికులు అభినందించారు.

























