మిస్టర్ డీజీపీ.. నన్ను అసభ్యంగా కామెంట్ చేసిన పోలీస్ను అరెస్ట్ చేయాలి: కవిత…
తనపై సోషల్ మీడియాలో అసభ్యకర వ్యాఖ్యలు చేసిన కానిస్టేబుల్పై కఠిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. కేవలం సస్పెండ్ చేసి చేతులు దులుపుకోవడం సరికాదని, కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డీజీపీని కోరారు. మహిళలపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన వారిపై చట్టాలు కఠినంగా ఉన్నాయని గుర్తుచేశారు.
హైదరాబాద్ బంజారాహిల్స్లోని తెలంగాణ రక్షణ సేన కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో కవిత మాట్లాడారు.
కవిత మాట్లాడుతూ..
తనను అసభ్యంగా దూషించిన కానిస్టేబుల్పై వెంటనే కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. కేవలం సస్పెన్షన్తో సరిపెట్టడం ఏమిటని ప్రశ్నించారు. భారత న్యాయ సంహిత, ఐటీ చట్టాల్లో మహిళలపై అసభ్యకర వ్యాఖ్యలకు సంబంధించిన నిబంధనలను డీజీపీ పరిశీలించాలని సూచించారు.
20 ఏళ్లుగా ప్రజా జీవితంలో ఉన్న తనకే రక్షణ లేకపోతే సామాన్య మహిళలకు ప్రభుత్వం ఎలాంటి భద్రత కల్పిస్తుందని ప్రశ్నించారు. పోలీస్ ఉన్నతాధికారులు ఈ వ్యవహారంలో బాధ్యతగా, సున్నితంగా వ్యవహరించాలని అన్నారు. తనపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన వ్యక్తిపై వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకోకపోతే అంతర్జాతీయ వేదికలపై ఈ అంశాన్ని ప్రస్తావిస్తానని హెచ్చరించారు.
రాష్ట్రంలో గంజాయి స్మగ్లింగ్ పెరుగుతోందంటూ పోలీస్ శాఖే చెబుతున్న పరిస్థితిపై కూడా కవిత విమర్శలు చేశారు. గంజాయి స్మగ్లింగ్ను అరికట్టాల్సిన బాధ్యత ఎవరిదని ప్రశ్నించారు. హేట్ స్పీచ్ను అరికట్టేందుకు ముఖ్యమంత్రి ప్రకటించిన బిల్లును ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు.
ఉద్యమకారులకు స్పష్టమైన హామీ ఇవ్వాలి
తెలంగాణ ఉద్యమకారులను అధికారంలోకి రావడానికి కాంగ్రెస్ పార్టీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉపయోగించుకున్నారని కవిత ఆరోపించారు. ఎన్నికలకు ముందు ఉద్యమకారులకు అనేక హామీలు ఇచ్చి, అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని విస్మరించారని విమర్శించారు.
ఉద్యమకారుల సమస్యల పరిష్కారానికి ఇప్పటికే అనేకసార్లు ఆందోళనలు జరిగాయని, ఇక వారికి ఆమరణ దీక్షలు చేయడం తప్ప మరో మార్గం లేకుండా పోయిందని అన్నారు. ఉద్యమకారుల కోసం తాము భూపోరాటం చేస్తే వారిపై లాఠీచార్జ్ చేయడం సరికాదని విమర్శించారు.
కేకే కమిటీ పేరుతో కాలయాపన చేయకుండా ఉద్యమకారుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే ప్రభుత్వం వద్ద ఉద్యమకారుల వివరాలు ఉన్నాయని, ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే వారికి నిర్ణీత కాల వ్యవధితో కూడిన స్పష్టమైన హామీ ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరారు.
లేకపోతే కాంగ్రెస్ నేతలను రాష్ట్రంలో తిరగకుండా అడ్డుకుంటామని కవిత హెచ్చరించారు.
బీసీలను మోసం చేసింది కాంగ్రెస్: కవిత
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ, వారి జనాభాను తక్కువగా చూపించిందని కవిత ఆరోపించారు. బీసీ రిజర్వేషన్ల బిల్లును అసెంబ్లీలో ఆమోదించినప్పటికీ, కేంద్రంపై ఒత్తిడి తీసుకురావడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందన్నారు.
బీసీ రిజర్వేషన్ల కోసం అఖిలపక్షాన్ని ఢిల్లీకి ఎందుకు తీసుకెళ్లడం లేదని ప్రశ్నించారు. కేంద్రం చేపట్టే కులగణనలో ప్రతి కులానికి సంబంధించిన వివరాలు స్పష్టంగా నమోదు చేసేలా ప్రత్యేక కాలమ్ ఉండాలని డిమాండ్ చేశారు.
బీసీలకు అన్యాయం చేసిన కాంగ్రెస్ పార్టీనే ఇప్పుడు కేంద్రంపై వంద రోజుల కార్యాచరణ పేరుతో ఆందోళనలు చేస్తామని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని కవిత విమర్శించారు.
అసెంబ్లీ సమావేశాల్లో ప్రజా సమస్యలపై చర్చ జరగకుండా కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు రాజకీయ నాటకాలకు పాల్పడుతున్నాయని ఆమె ఆరోపించారు.

























