నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 6 వారాల్లో 1,784 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్
నిజామాబాద్: మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న వారిపై నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఆగస్టు 2 నుంచి సెప్టెంబర్ 12 వరకు ఆరు వారాల పాటు నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో మొత్తం 1,784 కేసులు నమోదు చేసినట్లు పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య ఐపీఎస్ తెలిపారు.
నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్లతో పాటు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో తనిఖీలు నిర్వహించి మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న వారిని గుర్తించి కేసులు నమోదు చేశారు. పట్టుబడిన వారిని నిజామాబాద్, బోధన్, ఆర్మూర్ కోర్టుల్లో హాజరుపరచగా.. 124 మందికి వారం రోజుల జైలు శిక్ష విధించారు. మిగిలిన వారికి కలిపి రూ.1 కోటి 45 లక్షల 20 వేల జరిమానా విధించినట్లు కమిషనర్ వెల్లడించారు.
మద్యం సేవించి వాహనాలు నడపవద్దని పోలీస్ కమిషనర్ ప్రజలకు సూచించారు. డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడిన వారి డ్రైవింగ్ లైసెన్స్ను ఆరు నెలల పాటు సస్పెండ్ చేసే అవకాశం ఉందన్నారు. మైనర్లు మద్యం సేవించి వాహనం నడిపితే మైనర్తో పాటు వాహన యజమానిపై కూడా కేసు నమోదు చేసి, చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
డ్రంక్ అండ్ డ్రైవ్లో మొదటిసారి పట్టుబడితే రూ.10 వేల జరిమానా లేదా ఆరు నెలల వరకు జైలు శిక్ష, రెండోసారి పట్టుబడితే రూ.15 వేల జరిమానా లేదా జైలు శిక్ష విధించే అవకాశం ఉందని కమిషనర్ తెలిపారు. రోడ్డు ప్రమాదాల నివారణలో భాగంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని స్పష్టం చేశారు.

























