ఫీజుల నియంత్రణ చట్టాన్ని అమలు చేయాలి: పీడీఎస్యూ డిమాండ్…
పెండింగ్ బకాయిలు విడుదల చేయాలి.. ప్రభుత్వ విద్యా సంస్థలను బలోపేతం చేయాలని భారీ ర్యాలీ…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్
నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఫీజుల నియంత్రణ చట్టాన్ని అమలు చేయాలని, పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్లు, ఇతర బకాయిలను వెంటనే విడుదల చేయాలని, ప్రభుత్వ విద్యా సంస్థలను బలోపేతం చేయాలని డిమాండ్ చేస్తూ పీడీఎస్యూ ఆధ్వర్యంలో భారీ విద్యార్థి ర్యాలీ నిర్వహించారు.
రాజీవ్ గాంధీ ఆడిటోరియం నుంచి ధర్నా చౌక్ వరకు విద్యార్థులు భారీ ప్రదర్శన చేపట్టి, రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ మానవహారం నిర్వహించారు.
ఈ సందర్భంగా పీడీఎస్యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాయిబోయిన అనిల్, జిల్లా అధ్యక్షుడు కర్క గణేష్, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎల్. అనిల్ కుమార్ మాట్లాడుతూ, రాష్ట్రంలో వేలాది మంది విద్యార్థులకు ఇప్పటికీ ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్లు, కాస్మెటిక్ చార్జీలు, బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ (BAS) బకాయిలు విడుదల కాకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు.
పేద, మధ్యతరగతి విద్యార్థులు చదువును కొనసాగించలేని పరిస్థితి ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలను మూసివేసే నిర్ణయాన్ని ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసి, పెండింగ్లో ఉన్న ఉద్యోగుల వేతనాలను వెంటనే విడుదల చేయాలని, ప్రభుత్వ విద్యను బలోపేతం చేసే చర్యలు చేపట్టాలని కోరారు.
విద్యను హక్కుగా కాకుండా భారంగా చూడడం తగదని, ఎన్నికల సమయంలో విద్యార్థులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని కోరారు.
ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్లు, కాస్మెటిక్ చార్జీలు, బీఏఎస్ బకాయిలు విడుదల చేసి విద్యార్థుల సమస్యలను పరిష్కరించకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని పీడీఎస్యూ నాయకులు హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో పీడీఎస్యూ జిల్లా ఉపాధ్యక్షుడు ఎస్కే అషూర్, జిల్లా సహాయ కార్యదర్శి సృజన్, జిల్లా నాయకులు మున్నా, రేహాన్, హేమాంజలి, శ్రీశాంత్, మణితేజ, అమర్, కుమార్, పీడీఎస్యూ నాయకులు, విద్యార్థులు, ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

























