యూరియా కోసం రైతుల పాట్లు.. కాంగ్రెస్ సర్కారుపై జీవన్ రెడ్డి ఫైర్…
గణపతి బొప్పా మోరియా.. ఎక్కడ స్వామి యూరియా?
యూరియా కొరత, నకిలీ విత్తనాల బెడద, విద్యుత్ కోతలపై కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ నేత, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
ఖరీఫ్ సీజన్ ప్రారంభమైనా రైతులకు అవసరమైన యూరియా, డీఏపీ అందుబాటులో లేక ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. ఎరువుల కోసం రైతులు దుకాణాలు, సొసైటీల వద్ద క్యూ కడుతున్నా.. ‘నో స్టాక్’ బోర్డులే కనిపిస్తున్నాయని అన్నారు. యాప్ విధానాన్ని రద్దు చేసి మాన్యువల్ పద్ధతిలో యూరియా పంపిణీ చేయాలని రైతులు కోరుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు.
మరోవైపు రాష్ట్రంలో ఎడాపెడా విద్యుత్ కోతలతో పంటలు ఎండిపోతున్నాయని జీవన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. కరెంట్ సమస్యలతో మళ్లీ జనరేటర్లు, ఇన్వర్టర్ల షాపులు తెరుచుకునే పరిస్థితి వచ్చిందని అన్నారు. రైతుల విద్యుత్ అవసరాలపై ముందస్తు ప్రణాళిక లేకపోవడం ప్రభుత్వ వైఫల్యమేనని ఆరోపించారు.
రైతుల సమస్యలను పరిష్కరించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని, ఇందిరమ్మ రాజ్యం అంటే ఇదేనా.. ప్రజాపాలన అంటే ఇదేనా అంటూ జీవన్ రెడ్డి ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డి మాటలు తప్ప చేతల్లో పనితీరు కనిపించడం లేదంటూ తీవ్ర విమర్శలు చేశారు.

























