వినాయక చవితి రోజున విచారణ పేరుతో వేధింపులు దారుణం: వేముల ప్రశాంత్ రెడ్డి…
హైదరాబాద్: వినాయక చవితి పండుగ రోజున విచారణ పేరుతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పీఏ మహేందర్ రెడ్డి, పీఆర్వో మహేష్లను సైఫాబాద్ పోలీస్ స్టేషన్కు తీసుకురావడాన్ని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి తీవ్రంగా ఖండించారు.
అసెంబ్లీ సమావేశాల ప్రారంభం రోజున అసెంబ్లీ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నిరసన చేపట్టిన సమయంలో జరిగిన ఘటనకు సంబంధించి మహేందర్ రెడ్డి, మహేష్లపై కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టిందని ఆయన ఆరోపించారు.
ఇదే సమయంలో పోలీసుల సమక్షంలో మాస్కులు ధరించిన 15 మంది కాంగ్రెస్ కార్యకర్తలు వారిపై దాడికి యత్నించారని, బీఆర్ఎస్ లీగల్ సెల్ న్యాయవాదులు అడ్డుకోవడంతో వారు అక్కడి నుంచి వెళ్లిపోయారని తెలిపారు.
పోలీస్ స్టేషన్లోనే దాడికి యత్నించే స్థాయికి పరిస్థితులు చేరడం ఆందోళనకరమని వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. తెలంగాణలో శాంతిభద్రతల పరిస్థితిపై ముఖ్యమంత్రి, హోంశాఖను నిర్వహిస్తున్న రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
దాడికి యత్నించిన వారిని వెంటనే గుర్తించి, ఘటనపై సమగ్ర విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని వేముల ప్రశాంత్ రెడ్డి కోరారు.

























