మావోయిస్టు డివిజన్ కమిటీ సభ్యురాలు నక్కా సుశీల రాణి లొంగుబాటు…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్
నిజామాబాద్: మావోయిస్టు పార్టీ డివిజన్ కమిటీ సభ్యురాలు నక్కా సుశీల రాణి నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య ఐపీఎస్ ఎదుట లొంగిపోయారు. దీంతో తెలంగాణలో మావోయిస్టు పార్టీ మరింత బలహీనపడిందని పోలీసు అధికారులు తెలిపారు.
2026 సంవత్సరం తెలంగాణ పోలీసు శాఖ మావోయిస్టులపై కొనసాగిస్తున్న పోరాటంలో కీలక మలుపుగా మారిందని పోలీసులు పేర్కొన్నారు. స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ (SIB), గ్రేహౌండ్స్, జిల్లా పోలీసుల సమన్వయంతో చేపట్టిన వ్యూహాత్మక చర్యల ఫలితంగా ఈ ఏడాది ఇప్పటివరకు రికార్డు స్థాయిలో 266 మంది అజ్ఞాత మావోయిస్టులు హింసా మార్గాన్ని వీడి లొంగిపోయారని వెల్లడించారు.
లొంగిపోయిన వారిలో ముగ్గురు కేంద్ర కమిటీ సభ్యులు, 12 మంది రాష్ట్ర కమిటీ సభ్యులు, ఒక ప్రాంతీయ కమిటీ సభ్యుడు, 25 మంది డివిజనల్ కమిటీ కార్యదర్శులు/సభ్యులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. వీరితో పాటు 94 మంది ఏరియా కమిటీ సభ్యులు, 131 మంది సాధారణ మావోయిస్టులు లొంగిపోయారని పేర్కొన్నారు.
దీంతో మావోయిస్టు పార్టీ నెట్వర్క్ అగ్రస్థాయి నుంచి క్షేత్రస్థాయి వరకు గణనీయంగా బలహీనపడిందని పోలీసు అధికారులు వెల్లడించారు.
ప్రస్తుతం తెలంగాణకు చెందిన కొందరు మావోయిస్టు నేతలు ఇతర రాష్ట్రాల్లో పనిచేస్తున్నారని పోలీసులు తెలిపారు. వారిలో ముప్పాళ్ల లక్ష్మణ్రావు (గణపతి), జడె రత్నబాయి (సుజాత), వార్త శేఖర్ (మంగు) మాత్రమే అజ్ఞాతంలో ఉన్నట్లు వెల్లడించారు.
నక్కా సుశీల రాణి లొంగుబాటుతో మావోయిస్టు పార్టీ మరింత బలహీనపడిందని పోలీసులు తెలిపారు. అజ్ఞాతంలో ఉన్న మిగిలిన మావోయిస్టులు కూడా హింసా మార్గాన్ని వీడి, తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న లొంగుబాటు, పునరావాస విధానాన్ని సద్వినియోగం చేసుకుని సాధారణ జనజీవన స్రవంతిలో కలవాలని పోలీసు శాఖ విజ్ఞప్తి చేసింది.

























