మోర్తాడ్ సభలో మంత్రి సీతక్క పచ్చి అబద్ధాలు మాట్లాడారు
ముందు ఇచ్చిన హామీలపై కాంగ్రెస్ ప్రభుత్వం లెక్క చెప్పాలి: మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి…
హైదరాబాద్: మోర్తాడ్ సభలో జిల్లా ఇన్చార్జ్ మంత్రి సీతక్క చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు వెయ్యి రోజులు కావస్తున్నా ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను పూర్తిస్థాయిలో అమలు చేయకుండా, బీఆర్ఎస్పై విమర్శలు చేయడం సరికాదని ప్రశాంత్ రెడ్డి అన్నారు. “అబద్ధాల పార్టీ ఏదో రాష్ట్ర ప్రజలకు తెలుసు.. ముందు మీరు ఇచ్చిన హామీలపై లెక్క చెప్పండి” అని ఆయన డిమాండ్ చేశారు.
ఎన్నికల సమయంలో 100 రోజుల్లో ఆరు గ్యారంటీలు, 420 హామీలు అమలు చేస్తామని కాంగ్రెస్ ప్రకటించిందని గుర్తుచేసిన ఆయన.. మహిళలు, రైతులు, యువత, విద్యార్థులు, నిరుద్యోగులకు ఇచ్చిన హామీల్లో ఎన్ని పూర్తిగా అమలు చేశారో మంత్రి సీతక్క ప్రజల ముందు వెల్లడించాలని కోరారు.
రైతు రుణమాఫీపై ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ.. రూ.2 లక్షల రుణమాఫీ పూర్తిగా జరిగిందని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ, బాల్కొండ నియోజకవర్గంలోనే సుమారు 30 వేల మంది రైతులకు పూర్తి స్థాయిలో రుణమాఫీ కాలేదని ఆరోపించారు. అర్హులైన ప్రతి రైతు కుటుంబానికి పూర్తిస్థాయిలో రుణమాఫీ జరిగిందా లేదా ప్రభుత్వం స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు.
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఒక్కటే హామీ కాదని, ఎన్నికల సమయంలో మహిళలకు ఇచ్చిన ఇతర హామీలను కూడా ప్రభుత్వం అమలు చేయాలని అన్నారు. మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాల విషయంలో ప్రభుత్వం పూర్తి వివరాలను ప్రజల ముందు ఉంచాలని కోరారు.
అసెంబ్లీలో ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తామని భావించిన కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ ఎమ్మెల్యేల గొంతు నొక్కేందుకు ప్రయత్నించిందని ప్రశాంత్ రెడ్డి ఆరోపించారు. “ప్రభుత్వ వైఫల్యాలపై చర్చ పెట్టాలని అడిగిన ప్రతిపక్షాన్ని సస్పెండ్ చేసి బయటకు పంపడమేనా ప్రజాస్వామ్యం?” అని ప్రశ్నించారు.
స్పీకర్ను తమ సభ్యుడు అవమానించలేదని, ఒకవేళ అలా భావించి ఉంటే తమ సభ్యుడు, హరీశ్ రావు ఇప్పటికే విచారం వ్యక్తం చేశారని తెలిపారు. అనంతరం తెలంగాణ సాధనలో కీలక పాత్ర పోషించిన కేసీఆర్ ఇంటిపై దాడి చేయడం, ఆయనకు వ్యతిరేకంగా అనుచిత వ్యాఖ్యలు చేయడం ప్రజాపాలన ఎలా అవుతుందని ప్రశ్నించారు.
బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలపై జరిగిన దాడిని ఖండిస్తూ అసెంబ్లీలో చర్చించాలని తాము నిరసన తెలిపితే, తమ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేసి బయటకు పంపించారని ఆరోపించారు.
తాను గత పదేళ్లలో ఏమీ చేయలేదన్న మంత్రి సీతక్క వ్యాఖ్యలపై స్పందిస్తూ.. “మీరు సభ పెట్టిన మోర్తాడ్లోనే చూడండి.. సెంట్రల్ లైటింగ్, రోడ్లు, డివైడర్ పనులు గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే మంజూరు చేసి చేపట్టిన అభివృద్ధి పనులు” అని అన్నారు.
పాలెం, నాగాపూర్ గ్రామపంచాయతీ భవనాలు కూడా గత ప్రభుత్వ హయాంలోనే మంజూరై, శంకుస్థాపన జరిగినవేనని తెలిపారు. కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి వందల కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చి బాల్కొండ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశామని ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు.
రోడ్లు, డ్రైనేజీలు, విద్య, వైద్యం, సాగునీరు, తాగునీరు, మౌలిక వసతుల రంగాల్లో అనేక అభివృద్ధి పనులు చేపట్టామని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్తగా మంజూరు చేసి పూర్తి చేసిన అభివృద్ధి పనులు ఎన్ని ఉన్నాయో, వాటికి ఎంత నిధులు మంజూరు చేశారో ప్రజలకు వివరించాలని మంత్రి సీతక్కను ప్రశ్నించారు.
“కేసీఆర్ ప్రభుత్వం మంజూరు చేసిన పనులకు రిబ్బన్లు కట్ చేసుకుని గొప్పలు చెప్పుకోవడం కాదు.. మీ ప్రభుత్వం కొత్తగా మంజూరు చేసిన పనుల లెక్క ప్రజలకు చెప్పండి” అని డిమాండ్ చేశారు.
అబద్ధాలతో ప్రజలను ఎక్కువ కాలం మభ్యపెట్టలేరని, ప్రజలు అన్నింటినీ గమనిస్తున్నారని ప్రశాంత్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్పై విమర్శలు చేసే ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోను ముందుపెట్టుకుని, ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీపై లెక్క చెప్పాలని డిమాండ్ చేశారు.
మోర్తాడ్ సభలో వాస్తవాలను పక్కనపెట్టి విమర్శలు చేయడం మానుకోవాలని మంత్రి సీతక్కకు హితవు పలికిన వేముల ప్రశాంత్ రెడ్డి.. ముందుగా కాంగ్రెస్ ప్రభుత్వ వెయ్యి రోజుల పాలనపై ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

























