మున్సిపల్ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక నిధులు కేటాయించాలి
మంత్రి సీతక్కకు వినతిపత్రం అందజేసిన మున్సిపల్ ప్రతినిధులు…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గడిల లింగం
కామారెడ్డి: కామారెడ్డి జిల్లా పర్యటనకు వచ్చిన పంచాయతీరాజ్ శాఖ ఇన్చార్జ్ మంత్రి సీతక్క, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీకి మున్సిపల్ ప్రతినిధులు పట్టణ అభివృద్ధి, మౌలిక వసతుల సమస్యలపై వినతిపత్రం అందజేశారు.
పట్టణంలో నెలకొన్న పారిశుధ్య సమస్యల పరిష్కారానికి మురుగు కాల్వల నిర్మాణం చేపట్టడంతో పాటు సీసీ రోడ్లు, బీటీ రోడ్ల అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించాలని కోరారు. ముఖ్యంగా సీసీ డ్రైనేజీల నిర్మాణానికి రూ.10 కోట్ల ప్రత్యేక నిధులు మంజూరు చేయాలని మంత్రికి విజ్ఞప్తి చేశారు.
అదేవిధంగా కామారెడ్డి పట్టణంలో విద్యాభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. ఇంజినీరింగ్, నర్సింగ్, పాలిటెక్నిక్ కళాశాలల ఏర్పాటుతో పాటు స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు.
కామారెడ్డి పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు ప్రభుత్వం అవసరమైన సహకారం అందించాలని మున్సిపల్ ప్రతినిధులు వినతిపత్రంలో కోరారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ ప్రతినిధులు, అధికారులు, ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు.

























