ధర్పల్లి మండలంలో 616 చేయూత పెన్షన్ దరఖాస్తులు…
త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్
ధర్పల్లి: నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలంలో నూతన చేయూత పెన్షన్ల కోసం దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ బుధవారంతో ముగిసింది. మండల వ్యాప్తంగా మొత్తం 616 దరఖాస్తులు వచ్చినట్లు ఎంపీడీవో కార్యాలయ అధికారులు తెలిపారు.
వాటిలో వితంతు పెన్షన్లకు 269, ఒంటరి మహిళల విభాగంలో 82, దివ్యాంగుల విభాగంలో 166, చేనేత, గీత కార్మికులు తదితర వృత్తుల విభాగంలో 99 దరఖాస్తులు అందినట్లు అధికారులు వెల్లడించారు.
గురువారం నుంచి దరఖాస్తులపై క్షేత్రస్థాయి పరిశీలన (ఫీల్డ్ వెరిఫికేషన్) ప్రారంభం కానుందని తెలిపారు. ఈ ప్రక్రియలో సంబంధిత అధికారులు, సిబ్బందికి దరఖాస్తుదారులు సహకరించాలని అధికారులు సూచించారు.

























