ఏఎంసీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి పదవీకాలం పొడిగించాలని ఎమ్మెల్యేకు వినతి…
నిజామాబాద్: వ్యవసాయ మార్కెట్ కమిటీ (ఏఎంసీ) చైర్మన్గా కొనసాగుతున్న ముప్ప గంగారెడ్డి పదవీకాలాన్ని పొడిగించాలని కోరుతూ వ్యవసాయ మార్కెట్ యార్డు గుమస్తా, దడువాయి, ముల్లె హమాలీ, ఛాయా యూనియన్ నాయకులు శుక్రవారం నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డిని కలిశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు వినతిపత్రం అందజేసిన నాయకులు మాట్లాడుతూ.. వ్యవసాయ మార్కెట్ పరిధిలో రైతులు, కార్మికుల సంక్షేమం, అభివృద్ధి కోసం ముప్ప గంగారెడ్డికి మంచి అనుభవం ఉందన్నారు. ఆయన సేవలను కొనసాగించేందుకు పదవీకాలాన్ని పొడిగించాలని కోరారు.
రైతులు, వ్యాపారులు, కార్మికులకు మరింత ప్రయోజనం చేకూరేలా ప్రస్తుత చైర్మన్ పదవీకాలం పొడిగించే అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని ఎమ్మెల్యేను విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో దడువాయి ప్రెసిడెంట్ నేరెళ్ల శ్రీనివాస్ గౌడ్, గుమస్తా సంఘం అధ్యక్షుడు బాల ఆంజనేయులు, సెక్రటరీ గట్ల శ్రీనివాస్, జాయింట్ సెక్రటరీ శివకుమార్, ఛాయా సంఘం నాయకులు అనసూయ, గణేష్, ముల్లె సంఘం నాయకుడు వెంకటి రాము తదితరులు పాల్గొన్నారు.

























