గిరిజనుల సంక్షేమాన్ని గుర్తుచేసుకుంటూ ఈ నెల 17న ప్రత్యేక కార్యక్రమాలు…
నిజామాబాద్ రూరల్, సెప్టెంబర్ 15: మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో గిరిజనులు, ఎస్టీ, ఎస్సీ వర్గాల సంక్షేమం, అభివృద్ధి కోసం అమలు చేసిన పలు కార్యక్రమాలను గుర్తుచేసుకుంటూ ఈ నెల 17వ తేదీన తండాలు, గ్రామాల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ ఇన్చార్జ్ బాజిరెడ్డి జగన్మోహన్ తెలిపారు.
ఎస్టీ రిజర్వేషన్లను 6 శాతం నుంచి 10 శాతానికి పెంచి నాలుగు సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా ర్యాలీలు, ప్రత్యేక పూజలు నిర్వహించడంతో పాటు మాజీ సీఎం కేసీఆర్ చిత్రపటాలకు పాలాభిషేకాలు చేయాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు.
గత ప్రభుత్వ హయాంలో గ్రామ పంచాయతీల ఏర్పాటు, గురుకులాల ద్వారా గిరిజన విద్యార్థులకు మెరుగైన విద్యా అవకాశాలు, కళ్యాణలక్ష్మి, రైతుబంధు, పోడు భూముల హక్కులకు సంబంధించిన చర్యలు తదితర పలు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేసినట్లు బాజిరెడ్డి జగన్మోహన్ గుర్తుచేశారు.
ప్రస్తుతం గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని, పెండింగ్లో ఉన్న సమస్యలను పరిష్కరించి గిరిజనులకు న్యాయం చేయాలని ఆయన కోరారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర AIBSS నాయకులు శ్రీ హరినాయక్, జిల్లా AIBSS అధ్యక్షులు రామావత్ మోహన్ నాయక్, ధరావత్ గోపాల్, సంగ్యా నాయక్, నాయకపోడు సంఘం జిల్లా నాయకులు అన్నం సాయిల్, అశోక్ ఆకుల, కొండూర్, సంగ్యా నాయక్, శివరామ నాయక్, శంకర్ నాయక్, పర్శోన్ నాయక్, బని నాయక్, ఇందల్ నాయక్, సంతోష్ నాయక్, గోకుల్ సింగ్, గౌతం నాయక్ తదితరులు పాల్గొన్నారు.

























