భారత సాఫ్ట్బాల్ సబ్-జూనియర్ జట్టుకు నిజామాబాద్ క్రీడాకారిణులు…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్
నిజామాబాద్: భారత సాఫ్ట్బాల్ సబ్-జూనియర్ మహిళల జట్టుకు నిజామాబాద్ జిల్లాకు చెందిన ఇద్దరు క్రీడాకారిణులు ఎంపికయ్యారు. సాంఘిక సంక్షేమ పాఠశాల, సుద్దపల్లికి చెందిన దయ్యాల లిఖిత, సాంఘిక సంక్షేమ పాఠశాల, ధర్మారంకు చెందిన ఈర్నాల వర్షిణి భారత జట్టులో చోటు దక్కించుకున్నారు.
మహారాష్ట్రలోని సంజీవని యూనివర్సిటీ, కోపర్గావ్లో జూలై 24, 25 తేదీల్లో నిర్వహించిన తొలి సెలెక్షన్ ట్రయల్స్లో డి. లిఖిత, ఈ. వర్షిణి అద్భుత ప్రతిభ కనబరిచి ప్రాబబుల్స్ జట్టుకు ఎంపికయ్యారు. అనంతరం ఆగస్టు 24, 25 తేదీల్లో మధ్యప్రదేశ్లోని ఇండోర్లో నిర్వహించిన రెండో దశ సెలెక్షన్ ట్రయల్స్లోనూ తమ ప్రతిభను కొనసాగించి ప్రాబబుల్స్ జట్టులో స్థానం సంపాదించారు.
ఈ నెల 8 నుంచి 13 వరకు మహారాష్ట్రలోని సంజీవని యూనివర్సిటీ, కోపర్గావ్లో నిర్వహించిన తొలి శిక్షణ శిబిరంలో పాల్గొన్న క్రీడాకారిణులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు. దీంతో భారత సాఫ్ట్బాల్ సబ్-జూనియర్ మహిళల తుది జట్టుకు ఎంపికయ్యారని జిల్లా సాఫ్ట్బాల్ అసోసియేషన్ అధ్యక్షులు వి. ప్రభాకర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి మార్కంటి గంగా మోహన్ తెలిపారు.
అక్టోబర్ 5 నుంచి 10 వరకు పశ్చిమ బెంగాల్లోని కోల్కతాలో నిర్వహించనున్న తుది శిక్షణ శిబిరంలో లిఖిత, వర్షిణి పాల్గొంటారని తెలిపారు. అనంతరం అక్టోబర్ 12 నుంచి 18 వరకు చైనాలోని వెయిహైలో జరగనున్న సాఫ్ట్బాల్ సబ్-జూనియర్ మహిళల ఏషియా కప్ పోటీల్లో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించనున్నారని పేర్కొన్నారు.
భారత జట్టుకు ఎంపికైన జిల్లా క్రీడాకారిణులు దయ్యాల లిఖిత, ఈర్నాల వర్షిణిలను ఈ సందర్భంగా ఘనంగా సన్మానించారు. జిల్లా క్రీడాకారిణులు భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించనుండటంపై అసోసియేషన్ ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు.
భవిష్యత్తులో జిల్లాలోని మరింత మంది ప్రతిభావంతులైన క్రీడాకారులను గుర్తించి, వారికి మెరుగైన శిక్షణ అందిస్తూ జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించేలా తీర్చిదిద్దుతామని వారు తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా వ్యాయామ ఉపాధ్యాయ సంఘం ప్రధాన కార్యదర్శి బి. మల్లేష్ గౌడ్ పాల్గొన్నారు. అలాగే సాఫ్ట్బాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా సంయుక్త కార్యదర్శి కె. శోభన్ బాబు, రాష్ట్ర సాఫ్ట్బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కె. నవీన్ కుమార్, ఉపాధ్యక్షులు అభిషేక్ గౌడ్, ఇండియా కోచ్ డాక్టర్ కృష్ణ క్రీడాకారిణులను అభినందించారు.

























