పట్టపగలే దోపిడీ దొంగ బీభత్సం..
ఒంటరి మహిళపై బ్లేడుతో దాడి.. రూ.3 లక్షల విలువైన పుస్తెలతాడు అపహరణ…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గడిల లింగం
కామారెడ్డి, సెప్టెంబర్ 15: కామారెడ్డి పట్టణంలోని విద్యానగర్ కాలనీలో పట్టపగలే దోపిడీ దొంగ బీభత్సం సృష్టించాడు. ఒంటరిగా ఉన్న మహిళపై బ్లేడుతో దాడి చేసి, ఆమె మెడలోని బంగారు పుస్తెలతాడును లాక్కెళ్లిన ఘటన మంగళవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది.
కాలనీకి చెందిన జోన్నాల సునీత (33) ఇంట్లో భోజనం చేస్తుండగా ఓ గుర్తుతెలియని వ్యక్తి ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించాడు. అనంతరం ఆమెపై ఒక్కసారిగా బ్లేడుతో దాడి చేయడంతో సునీతకు తీవ్ర రక్తగాయాలయ్యాయి.
అనంతరం ఆమెను చంపేస్తానని బెదిరించి, మెడలో ఉన్న బంగారు పుస్తెలతాడును బలవంతంగా లాక్కెళ్లాడు. దాని విలువ సుమారు రూ.3 లక్షలు ఉంటుందని బాధితురాలు తెలిపింది.
దోపిడీ అనంతరం దుండగుడు అక్కడి నుంచి పరారయ్యాడు. సునీత కేకలు విని కాలనీవాసులు అక్కడికి చేరుకుని ఆమెను పరామర్శించారు. ఈ ఘటనతో విద్యానగర్ కాలనీలో భయాందోళన నెలకొంది.
ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సీసీ కెమెరాల ఆధారంగా దుండగుడిని గుర్తించి త్వరగా అరెస్ట్ చేయాలని స్థానికులు కోరుతున్నారు.

























