గ్రామాల అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం: ఎమ్మెల్యే డా.ఆర్.భూపతి రెడ్డి…
అన్సాంపల్లి లో అభివృద్ధి పనులకు రూ.7 లక్షలు SDF
ఎస్డీఎఫ్ నిధుల కింద రూ.7 లక్షల ప్రొసీడింగ్ పత్రాల పంపిణీ…
గ్రామాల సమగ్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి పేర్కొన్నారు. శనివారం ఇందల్వాయి మండలం అన్సాంపల్లి గ్రామ అభివృద్ధి కోసం స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ (SDF) నిధుల కింద రూ.7 లక్షల విలువైన ప్రొసీడింగ్ పత్రాలను కాంగ్రెస్ పార్టీ నాయకులు సంతోష్ రెడ్డి నేతృత్వంలో గ్రామ సర్పంచ్, లోకాని మౌనిక- నిఖిల్ , ఉప సర్పంచ్ గంగాధర్ గ్రామ పెద్దలకు ఎమ్మెల్యే అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, గ్రామ అభివృద్ధికి ఇప్పటికే లక్షల రూపాయలతో పలు అభివృద్ధి పనులు చేపట్టామని తెలిపారు. గ్రామంలో అర్హులైన పేద కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేశామని, రెండో విడతలో మరిన్ని అర్హులకు ఇళ్లు మంజూరు చేసేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
ఎస్డీఎఫ్ నిధుల కింద ముదిరాజ్ సంఘం అభివృద్ధికి రూ.5లక్షలు,శ్మశానవాటికలో నీటి వసతికి రూ. 2లక్షలు మంజూరు చేసినట్లు తెలిపారు.
ప్రజల అవసరాలకు అనుగుణంగా గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పన, దేవాలయాలు, సామాజిక భవనాల అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలుకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ప్రజల సహకారంతో ప్రతి గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దేందుకు కృషి కొనసాగిస్తామని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు, ముదిరాజ్ సంఘం నాయకులు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

























