సప్త భజనలతో పాడిపంటలు సమృద్ధిగా పండాలి…
3వరోజు ఆధ్యాత్మిక ప్రసంగంలో శ్రీ రాఘవేంద్ర స్వామి…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్
ఇందూరు జిల్లాలో ఆశ్రమాలయాలకు కొదవలేదు. ఆషాడ మాసంలో నిర్వహించే గురు పౌర్ణమి వేడుకల్ని వేల్పూర్ శివారులో గల గోవిందగిరి దివ్య యోగాశ్రమంలో అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. బుధ, గురువారం రెండు రోజులు భజన కళాకారులు సప్తభజనల్లో నిమగ్నమయ్యారు. తమ ప్రతిభ పాటవాల్ని ప్రదర్శించి రెండు రోజుల్ని సంపూర్ణంగా విజయవంతం చేశారు. శుక్రవారం మూడవరోజు మోతె, రావుట్ల, ఆర్మూర్, గోవింద్ పేట్ గ్రామాలకు చెందిన భజన బృందాల కళాకారులు పోటా పోటీగా పాల్గొని తమ ప్రావీణ్యాన్ని ప్రదర్శించారు. విలక్షణ శైలిలో భజన పాటలు పాడి కార్యక్రమానికి వన్నె తెచ్చారు. “నమ్ము ప్రభూ దర్శనం ఆత్మ సందర్శనం గురుదేవా.. నమ్మి యున్నాను మహానుభావా, అయ్యా ఎన్నెన్నో జన్మములెత్తి నేను తల్లిదండ్రులను మరిచి వస్తి… హరవో నమశ్శివాయనరా, ఒక్కడే దేవుడురా… అంటూ భజన పాటలు పాడి ఆనంద సాగరంలో ముంచెత్తారు. వేల్పూర్ కు చెందిన పన్నాల అరుణ, యమునవ్వ కుటుంబ సభ్యులు గురుపాదుకాపూజ చేశారు. భక్తులను ఉద్దేశించి ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీ రాఘవేంద్ర స్వామి మాట్లాడుతూ ఈ సప్త భజనలతో సమస్త ప్రజలందరూ ఆయురారోగ్యాలతో బాసిల్లాలని, వర్షాలు సకాలంలో కురిసి పాడిపంటలు సమృద్ధిగా పండాలని, పశుసంపద క్షేమంగా ఉండాలని, కరువు కాటకాలు రాకూడదని అన్నారు. తదనంతరము శ్రీ రాఘవేంద్ర స్వామి వివిధ గ్రామాల నుండి వచ్చిన భజన కళాకారులకు లడ్డు ప్రసాదాల్ని ఇచ్చి చిరు జ్ఞాపికల్ని బహుకరించారు. ఈ బృహత్తరమైన కార్యక్రమంలో కమిటీ సభ్యులు, స్వామి శిష్యులు, భజన కళాకారులు, సాయి సేవకులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.























