పిప్రిలో ఘనంగా తాతయ్యల ఆయిల పండుగ…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్
నిజామాబాద్ జిల్లా భీంగల్ మండలం పిప్రి గ్రామంలో తాతయ్యల ఆయిల పండుగను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. వీడీసీ ఆధ్వర్యంలో దేవాదాయ కమిటీ, గ్రామ ప్రజలు కలిసి సంప్రదాయబద్ధంగా ఈ వేడుకలను నిర్వహించారు.
ప్రతి సంవత్సరం ఎడ్లపుల అమావాస్య అనంతరం వచ్చే శుక్రవారం తాతయ్యల ఆయిల పండుగను నిర్వహించడం గ్రామంలో ఆనవాయితీగా వస్తోందని గ్రామ పెద్దలు తెలిపారు. తాతయ్యల విగ్రహాలను ప్రత్యేకంగా అలంకరించి, నూతన వస్త్రాలు ధరింపజేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులు తమ మొక్కులు చెల్లించుకున్నారు.
ఈ సందర్భంగా గ్రామ పెద్దలు మాట్లాడుతూ.. తాతయ్యల ఆశీస్సులతో పంటలు సమృద్ధిగా పండాలని, గ్రామంలో సుఖశాంతులు నెలకొనాలని ఆకాంక్షించారు. గ్రామ ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సంతోషంగా ఉండాలని ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
తాతయ్యల ఆయిల పండుగను గ్రామంలో పెద్దల పండుగగా భావిస్తూ ప్రతి ఏటా భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ వేడుకల్లో వీడీసీ సభ్యులు, దేవాదాయ కమిటీ ప్రతినిధులు, గ్రామ పెద్దలు, మహిళలు, యువకులు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

























