గడిచిన మూడు వారాల్లో 559 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు…
రూ.52.80 లక్షల జరిమానా.. 31 మందికి వారం రోజుల జైలు శిక్ష: పోలీస్ కమిషనర్…
నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో గడిచిన మూడు వారాల్లో నిర్వహించిన ప్రత్యేక డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో మొత్తం 559 మంది మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పోలీసులకు పట్టుబడ్డారని పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య, ఐపీఎస్ తెలిపారు.
తేదీ 29-06-2026 నుండి 17-07-2026 వరకు నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్లతో పాటు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ల పరిధిలో విస్తృతంగా వాహన తనిఖీలు నిర్వహించగా 559 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు.
పట్టుబడిన వారిని నిజామాబాద్, బోధన్, ఆర్మూర్ కోర్టుల్లో హాజరుపరచగా, 31 మందికి వారం రోజుల జైలు శిక్ష విధించగా, మిగిలిన వారికి కలిపి రూ.52,80,000 జరిమానా విధించినట్లు తెలిపారు.
కమిషనరేట్ పరిధిలో అధిక మోతాదులో మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పోలీసులకు పట్టుబడుతున్న వారి సంఖ్య పెరుగుతున్నందున ప్రత్యేక తనిఖీలు కొనసాగుతాయని కమిషనర్ స్పష్టం చేశారు.
పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య, ఐపీఎస్ ప్రజలకు చేసిన సూచనలు:
1. మద్యం సేవించి ఎట్టి పరిస్థితుల్లోనూ వాహనాలు నడపవద్దు.
2. వాహనానికి సంబంధించిన అన్ని చట్టబద్ధ పత్రాలను ఎల్లప్పుడూ వెంట ఉంచుకోవాలి.
3. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో పట్టుబడిన వారి డ్రైవింగ్ లైసెన్స్ను ఆరు నెలల పాటు సస్పెండ్ చేస్తారు.
4. మద్యం సేవించి వాహనం నడిపి ప్రమాదానికి కారణమైతే బీమా (ఇన్సూరెన్స్) ప్రయోజనాలు లభించవు.
5. మైనర్లు మద్యం సేవించి వాహనం నడుపుతూ పట్టుబడితే, మైనర్తో పాటు వాహన యజమానిపై కూడా కేసు నమోదు చేసి చార్జ్షీట్ దాఖలు చేస్తారు. జైలు శిక్ష పడే అవకాశం కూడా ఉంటుంది.
6. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో ఒకటి కంటే ఎక్కువసార్లు పట్టుబడితే జైలు శిక్ష విధించే అవకాశం ఉంది.
7. మోటార్ వెహికల్స్ చట్టం, 1988 (2019 సవరణ) ప్రకారం మొదటిసారి డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడితే రూ.10,000 జరిమానా లేదా ఆరు నెలల వరకు జైలు శిక్ష లేదా రెండూ విధించవచ్చు. రెండోసారి పట్టుబడితే రూ.15,000 జరిమానా లేదా జైలు శిక్ష లేదా రెండూ విధించే అవకాశం ఉంది.

























