అన్ని పంటలకు బోనస్ ప్రకటించాలి
ఎల్ నినో ఉమ్మడి జిల్లా సమావేశంలో అర్బన్ ఎమ్మెల్యే…
ఇందూరు: వరితో పాటు ఇతర పంటలకు కూడా రాష్ట్ర ప్రభుత్వం బోనస్ చెల్లించాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా తెలిపారు. ఎల్ నినో ప్రభావంతో వర్షాబావ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో సోమవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… ఎల్ నినో ప్రభావంతో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదు అవుతుందన్నారు. ఈ నేపథ్యంలో రైతులకు సాగునీరు అందడం లేద ని పేర్కొన్నారు. ప్రభుత్వం ప్రత్యామ్నాయ పంటలను ఎంచుకోవాలని సూచిస్తుంది కానీ, రాష్ట్రంలో వరి పంటకు బోనస్ ప్రకటించడంతో రైతులు వరిపైనే ముగ్గు చూపుతున్నారన్నారు. దీంతో ఇలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు ఇబ్బందులు తప్పడం లేదన్నారు కావున ప్రభుత్వం ఇతర పంటలకు బోనస్ ఇవ్వాలని సూచించారు. ప్రధానంగా రైతులు సజ్జలు, కందులు, కొర్రలు, కూరగాయలు, ఆయిల్ పామ్ వాటిపై దృష్టి సారించాలని తెలిపారు. అలాగే తెలంగాణలో పీఎం ఫసల్ బీమా యోజన కూడా అమలు చేయాలని డిమాండ్ చేశారు. బియ్యం ధరలు కూడా రోజు రోజుకు పెరుగుతున్నాయని గుర్తు చేశారు. కావున వాటిపై దృష్టి సారించాలని పేర్కొన్నారు.
నిజాంసాగర్ లో నీళ్లు సరిపడా లేని విషయం తెలిసిందేనన్నారు. కావున జిల్లాలో బినోల నుంచి అలీ సాగర్ వరకు 900 కోట్లతో లిఫ్ట్ చేసిన పంపులను వెంటనే ప్రారంభించాలన్నారు. అలాగే కాలేశ్వరం నుంచి హల్దీ వాగు కు నీటిని లిఫ్ట్ చేసి నిజాంసాగర్ ను నింపాలని తెలిపారు. జిల్లాలో సుమారు 4 లక్షల బోర్లు ఉంటాయని, వాటికి నాణ్యమైన విద్యుత్తును అందజేయాలన్నారు.

























